జై భీమ్ టీవీ - ఆంధ్ర ప్రదేశ్ / ఏలూరు జిల్లా : పుష్ప సినిమా డైలాగ్ లాగా.. 'దమ్ముంటే పట్టుకో' అంటూ పోలీసులకు సవాల్ విసిరిన దొంగ కథ ఇది. వంద బైకులు దొంగతనం చేశానని, పోలీసులు తనను ఏమీ చేయలేరని రెచ్చిపోయిన దొంగకు పోలీసులు గట్టిగా బుద్ధి చెప్పారు. ఏలూరు జిల్లాలో జరిగిన ఈ ఘటనలో, సవాల్ చేసిన దొంగతో పాటు అతని గ్యాంగ్ను అరెస్ట్ చేసి, 12 బైకులను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. దమ్ముంటే పట్టుకోండంటూ పోలీసులకు సవాల్ దొంగను పట్టుకుని తిక్క కుదిర్చిన పోలీసులు అతడితో సహా మొత్తం ఐదుగుర్ని అరెస్ట్ చేశారు దమ్ముంటే పట్టుకో షెకావత్ అంటూ పుష్ప సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది. సేమ్ టు సేమ్ అలాగే దమ్ముంటే తనను పట్టుకోవాలంటూ పోలీసులకు ఓ దొంగ సవాల్ విసిరాడు. పుష్ప సినిమా కాబట్టి ఓకే.. మరి రియల్గా సవాల్ చేస్తే పోలీసులు ఊరుకుంటారా.. మనోడి తిక్క కుదిర్చారు. దొంగ సవాల్కు పోలీసుల రియల్ రియాక్షన్ అదిరిపోయింది. ఏలూరు జిల్లాలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. 'నేను వంద బైక్లు దొంగతనం చేశా’ సవాల్కి రియల్ రియాక్షన్' అంటూ ఏలూరు జిల్లా పోలీసులు వీడియోను షేర్ చేశారు. ప్రస్తుతం అది వైరల్గా మారింది. ఓ దొంగ పోలీసులకు సవాల్ విసిరాడు. ' రెల్లిపేట నాగ అంటార్రా బాబూ.. ఇప్పటి వరకు వంద బండ్లు దొంగతనం చేశా. గతంలో ఎన్నోసార్లు దొరికిపోయా.. మళ్లీ కొద్ది రోజులకే బయటకొచ్చేశా. పోలీసులు నన్నేమీ చేయలేరు’ అంటూ సవాల్ చేశాడు. ఈ వీడియోను రికార్డు చేయగా.. సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు.. సవాల్ చేసిన దొంగ తిక్క కుదిర్చారు. అతడితో పాటూ గ్యాంగ్ మొత్తాన్ని అరెస్ట్ చేశారు. ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిశోర్ ఈ బైక్ దొంగ వ్యవహారానికి సంబంధించిన వివరాలు వెల్లడించారు. కొద్దిరోజులుగా నూజివీడు పరిసర ప్రాంతాల్లో బైక్లు వరుసగా చోరీ అవుతున్నాయి. పోలీసులకు ఫిర్యాదులు రావడంతో వెంటనే రంగంలోకి దిగి ఆరా తీశారు. అదే సమయంలో దులాయ్ గణేశ్ అలియాస్ నాగపవన్ వీడియో వైరల్ అయ్యింది. 'బైక్లు చోరీ చేశాను.. పోలీసులు ఏం చేస్తారు' అంటూ వీడియో తీసుకుని ఫ్రెండ్స్కు పంపాడు. ఆ తర్వాత ఈ వీడియో బాగా వైరల్ అయ్యింది. ఈ విషయం పోలీసులకు తెలియడంతో వెంటనే రంగంలోకి దిగి నిఘా ఉంచారు. ఐదుగురు సభ్యుల దొంగల ముఠాను అరెస్ట్ చేశారు. వీరిలో ఏలూరు జిల్లా నూజివీడు రెల్లిపేటకు చెందిన దలాయ్ గణేశ్.. ఎంఆర్ అప్పారావు కాలనీకి చెందిన షేక్ ఆసిఫుల్లా, చిత్తూరి అజయ్కుమార్, గాంధీబొమ్మ కూడలికి చెందిన షేక్ మెహర్బాబా, గొల్లపల్లికి చెందిన చౌటపల్లి సుభాష్గా గుర్తించారు. ఈ ముఠా దగ్గర నుంచి మొత్తం 12 బైక్లు సీజ్ చేశారు పోలీసులు. ఈ గ్యాంగ్ జల్సాలు, వ్యసనాలకు అలవాటు పడింది. వీరు డబ్బులు ఈజీగా సంపాదించేందుకు చోరీలు చేస్తున్నారని పోలీసులు గుర్తించారు. ఈ గ్యాంగ్లో పోలీసులకు సవాలు విసిరిన గణేశు ప్రధాన నిందితుడిగా గుర్తించారు పోలీసులు. అతడ్ని అరెస్ట్ చేసిన తర్వాత స్వయంగా జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిశోర్ పోలీసులకు సవాల్ చేసిన వీడియోలో ఏం అన్నావో చెప్పూ అంటే అతడితోనే చెప్పించారు. అయితే తాను మద్యం మత్తులో అలా మాట్లాడానని.. తప్పు చేశానని గణేశ్ అన్నాడు. దొంగ ఓవరాక్షన్-పోలీసుల రియాక్షన్ అంటూ సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవుతోంది. ఏలూరు పోలీసులపై ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ప్రశంసలు కురిపించారు. దొంగల నుంచి పోలీసులు భారీగా బైక్లు రికవర్ చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. ఓ మహిళ పోగొట్టుకున్న బైక్ను పోలీసులు కనిపెట్టి ఇవ్వడంతో ఆమె ఎమోషనల్ అయ్యారు.. ఆ వీడియో కూడా వైరల్ అయ్యింది. అంతేకాదు తప్పిపోయిన పలువురు చిన్నారుల్ని తిరిగి తల్లి దండ్రులకు కూడా అప్పగించారు. మంత్రి లోకేష్ ఏలూరు జిల్లా పోలీసుల పనితీరును ప్రశంసించారు.
Admin