జై భీమ్ టీవీ - తెలంగాణ / హైదరబాద్ : హైదరాబాద్: తాజాగా విడుదల చేసిన దళిత డిక్లరేషన్పై అధికార పక్షం చేస్తున్న విమర్శలకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. తమ డిక్లరేషన్ దళితుడిని సీఎం చేస్తానని మోసగించడం లాంటిది కాదని.. గిరిజన జీవితాలలో గుణాత్మక మార్పునకు కన్ఫర్మేషన్ అని రేవంత్ తెలిపారు. ‘‘మా డిక్లరేషన్ దళిత - గిరిజన జీవితాలలో గుణాత్మక మార్పునకు కన్ఫర్మేషన్. 1. మా డిక్లరేషన్ … దళితుడ్ని సీఎం చేస్తానని మోసం చేయడం లాంటిది కాదు. 2. మా డిక్లరేషన్… ప్రతి దళిత కుటుంబానికి మూడెకరాల భూమి ఇస్తానని మోసం చేయడం లాంటిది కాదు. 3. మా డిక్లరేషన్… గిరిజన రిజర్వేషన్లు 12 శాతం చొప్పున పెంచుతానని మోసం చేయడం లాంటిది కాదు. 4. మా డిక్లరేషన్… మద్ధతు ధర అడిగిన గిరిజన రైతులను బందిపోట్ల కంటే ఘోరంగా బేడీలు వేసి అవమానించడం లాంటిది కాదు. 5. మా డిక్లరేషన్ … నేరెళ్ళ ఇసుక దోపిడీని ప్రశ్నించిన దళిత - బీసీ బిడ్డల పై థర్డ్ డిగ్రీ ప్రయోగించడం లాంటిది కాదు. 6. మా డిక్లరేషన్… దళిత - గిరిజనులకు కాంగ్రెస్ హయాంలో ఇచ్చిన అసైన్డ్ భూములను లాక్కుని రియల్ ఎస్టేట్ మాఫియాకు అమ్ముకోవడం లాంటిది కాదు. 7. మా డిక్లరేషన్… దళిత మహిళ మరియమ్మను లాకప్ డెత్ చేయించడం లాంటిది కాదు. 8. మా డిక్లరేషన్… ఒకే కుటుంబంలో ముగ్గురు మంత్రి పదవులు తీసుకుని ఒక్క మాదిగకు కూడా మంత్రి పదవి ఇవ్వకపోవడం లాంటిది కాదు. 9. మా డిక్లరేషన్… ఎబిసిడి వర్గీకరణ చేయకుండా మోసం చేయడం లాంటిది కాదు. 10. మా డిక్లరేషన్… దళితబంధు పథకంలో 30 శాతం కమీషన్లకు కక్కుర్తిపడే రాబందుల లాంటిది కాదు. అందుకే… యావత్ తెలంగాణ గుండె చప్పుడు ఒక్కటే’’ అన్నారు. ఫైనల్గా “కేసీఆర్ ఖేల్ ఖతం - బీఆర్ఎస్ దుఖాన్ బంద్” అనే నినాదాన్ని ఇచ్చారు.
Admin