జై భీమ్ టీవీ - తెలంగాణ / : కర్ణాటక విజయం తర్వాత తెలంగాణలో ఫుల్ జోష్లో ఉన్న కాంగ్రెస్ గెలుపు తనదేనంటోంది. అధికారంలో కొచ్చేది తామేనంటోంది. అంతర్గత విభేదాలున్నా, నేతల అలకలు ఆగకున్నా అధికారపీఠం అందుకోవాలన్న టార్గెట్తో.. వ్యూహాత్మకంగా ముందుకెళ్తోంది హస్తం పార్టీ. ఆరు గ్యారంటీ స్కీములతో కన్నడ ఫార్ములాని తెరపైకి తెచ్చింది. అన్ని వర్గాలను ఆకట్టుకునేలా ఆ ఆరు స్కీములను ప్రకటించిన కాంగ్రెస్.. ప్రజల్లోకి వాటిని విస్తృతంగా తీసుకెళ్లే ప్రయత్నాల్లో ఉంది. మహిళలకోసం మహాలక్ష్మి పథకం, రైతు భరోసా పథకం, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్ల పథకం, యువ వికాస పథకం, చేయూత పథకంతో.. కర్ణాటక విక్టరీ ఇక్కడ కూడా రిపీట్ అవుతుందన్నది కాంగ్రెస్ ఆలోచన. తన మార్క్ స్కీములు ప్రకటించటంతో పాటు.. తెలంగాణలో బీఆర్ఎస్ అమలుచేస్తున్న పథకాలకు ఎక్స్టెన్షన్ ఇచ్చేలా ఉన్నాయ్ కాంగ్రెస్ హామీలు షాదీముబారక్ తరహా పథకంలో తులం బంగారం ఈ అడిషనల్ ఆలోచనే. అగ్రనేతల పర్యటనలు, హామీలతో కాంగ్రెస్ ప్రచారానికి హైప్వచ్చింది. డిక్లరేషన్లతో అందరి భవిష్యత్తుకూ హామీ ఇస్తోంది హస్తంపార్టీ. వరంగల్జిల్లాలో రైతు డిక్లరేషన్ ప్రకటించారు రాహుల్గాంధీ. యూత్ డిక్లరేషన్తో యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది కాంగ్రెస్. ఇబ్రహీంపట్నం సభలో ప్రియాంకగాంధీ మహిళా డిక్లరేషన్ ప్రకటిస్తే, చేవెళ్ల సభలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ ప్రకటించారు. ఈ డిక్లరేషన్లతో తన పాలసీని ప్రజల్లోకి వెళ్లేలా చేసుకోగలిగింది కాంగ్రెస్. కొత్త నేతల చేరికలు పార్టీకి ఊపుతీసుకొచ్చినా అదే సమయంలో కొందరు ముఖ్యనేతల నిష్క్రమణలు పార్టీకి సవాలుగా మారాయి. టికెట్ల ప్రకటన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందోనన్న ఆందోళన ఆ పార్టీకున్నా.. ఏఐసీసీ సర్వేలే ప్రాతిపదికగా అభ్యర్థుల ఎంపిక ఉంటుందని ముందే సంకేతాలిస్తున్నారు పార్టీ నేతలు. అభయహస్తంపేరుతో ఆ పార్టీ స్కీములు ప్రకటిస్తోంది. పది పోలింగ్ స్టేషన్లకు ఒక ఇంచార్జిని నియమించేలా ఎలక్షనీరింగ్పై కసరత్తుచేస్తోంది. అభ్యర్థుల ప్రకటన కాస్త ఆలస్యమైనా పక్కా వ్యూహంతో ముందుకెళ్తోంది కాంగ్రెస్. తిరగబడదాం- తరిమికొడదాం ఇదే ఇప్పుడు కాంగ్రెస్ ఎలక్షన్ స్లోగన్.. డిసెంబర్లో అద్భుతాలు జరగబోతున్నాయ్.. రేవంత్ రెడ్డి ఎన్నికల డేట్ ప్రకటన అనంతరం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. డిసెంబర్లో అద్భుతాలు జరగబోతున్నాయంటూ రేవంత్ వ్యాఖ్యానించారు. ప్రజా తీర్పు నిర్ణయం అయిపోయిందని, రాష్ట్ర ప్రజలకు విముక్తి లభించబోతోందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతోందన్న రేవంత్ రెడ్డి.. సీఎం కేసీఆర్ విశ్రాంతి తీసుకోవాల్సిన సమయం వచ్చిందంటూ వ్యాఖ్యానించారు.
Admin