జై భీమ్ టీవీ - తెలంగాణ / : భారతీయ జనతా పార్టీలో కొందరు సీనియర్లు పోటీ చేయడానికి సముఖంగా లేరని, మరికొందరు పార్టీ మారతారని జోరుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో DK అరుణ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలను ఖండించారు. తనపై జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేశారు. మీడియాలో తాను కాంగ్రెస్ పార్టీ లో చేరుతునట్లు వస్తున్న వార్తలను బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తీవ్రంగా ఖండించారు. ఈ విషయం పై పత్రిక ప్రకటన విడుదల చేసిన డీకే అరుణ, తాను కాంగ్రెస్ పార్టీలో చేరే ప్రసక్తి లేదని క్లారిటీ ఇచ్చారు. కొందరు కాంగ్రెస్ నేతలు కావాలని మైండ్ గేమ్ ఆడుతున్నారని డీకే అరుణ మండిపడ్డారు. భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం తనను గుర్తించి జాతీయ ఉపాధ్యక్ష పదవి ఇచ్చిందని గుర్తు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో పని చేయడానికి అదృష్టం ఉండాలని డీకే అరుణ అన్నారు. కనీసం తన స్పందన తీసుకోకుండా వార్త కథనాలు రాయడం సరైంది కాదని డీకే అరుణ మండిపడ్డారు. తన రాజకీయ భవిష్యత్ నిర్ణయించాల్సిన హక్కు ఎవరు ఇచ్చారని విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ లో తన చేరికపై దుష్ప్రచారం చేస్తున్న వారిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తనపై దుష్ప్రచారం చేసిన మీడియా సంస్థలపై పరువు నష్టం దావా వేస్తానని డీకే అరుణ తెలిపారు. ఇటీవల తెలంగాణ బీజేపీ ఎలక్షన్ స్క్రీనింగ్ కమిటీ ఛైర్మన్ కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి బీజేపీకి రాజీనామా చేశారు. గత కొంతకాలంగా ఆయన BJP నాయకత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. దానికి తగ్గట్టుగా బీజేపీ విడుదల చేసిన ఎమ్మెల్యే అభ్యర్థుల తొలి జాబితాలో ఆయన పేరు కనిపించలేదు. ఈ క్రమంలో వారం రోజుల క్రితమే పార్టీ మార్పుపై ఆయన హింట్ ఇచ్చారు. మునుగోడు ప్రజల ఆలోచనలకు అనుగుణంగా తన నిర్ణయం ఉంటుందని ప్రకటించిన రాజగోపాల్రెడ్డి తన నిర్ణయాన్ని ప్రకటించారు. కాంగ్రెస్లో చేరనున్నట్టు ఆయన వెల్లడించారు. కమలాన్ని వదలికి మళ్లీ హస్తం గూటికి చేరనున్న రాజగోపాల్రెడ్డి.. రాజీనామా చేస్తూనే బీజేపీపై తీవ్ర ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్కి ప్రత్యామ్నాయం బీజేపీ కాదన్నారు రాజగోపాల్. ఏదో ఊహించుకుని పోతే.. అక్కడ ఇంకేదో జరుగుతోందనీ.. అందుకే పార్టీని వీడాల్సిన అవసరం వచ్చిందన్నారాయన. తన లాగే చాలా మంది నేతలు కూడా త్వరలోనే బీజేపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశముందన్నారు. ఈ నేపథ్యంలోనే తనపై వస్తున్న రూమర్స్పై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఘాటుగా స్పందించారు.
Admin