జై భీమ్ టీవీ - జాతియం / : ఢిల్లీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. బిర్యాని కొనేందుకు డబ్బులు ఇవ్వలేదనీ 18 ఏళ్ల యువకుడిని కత్తితో పొడిచి చంపి, ఆ తర్వాత మృతదేహం ముందు నిందితుడు డ్యాన్స్ చేశాడు. ఇందుకు సంబంధించిన సీసీ ఫుటేజీ విజువల్స్ బయటికి రావడంతో కలకలం రేగింది. మద్యం మత్తులో ఉన్న ఓ మైనర్ బాలుడు బిర్యానీ తినేందుకు డబ్బులు ఇవ్వలేదనీ బాధితుడిని దారుణంగా హత్య చేశాడు. కత్తితో శరీరంపై ఏకంగా 55 సార్లు పొడిచి చంపాడు. అనంతరం మృతదేహాన్ని రోడ్లపై ఈడ్చుకుంటూ వెళ్తూ.. నృత్యం చేస్తూ పైశాచికంగా ప్రవర్తించాడు. ఈశాన్య ఢిల్లీలోని వెల్కమ్ ఏరియాలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈశాన్య ఢిల్లీలోని వెల్కమ్ ఏరియాలో రూ.350 కోసం నిందితుడు దారుణ హత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. సీసీటీవీ ఫుటేజీలో కనిపించిన దృశ్యాల్లో 16 యేళ్ల వయసున్న మైనర్ బాలుడు మద్యం మత్తులో బాధితుడిని మొదట గొంతు కోసి, ఆ తర్వాత 55 సార్లు కత్తితో పొడిచి హత్య చేశాడు. శవాన్ని వీధుల్లో ఈడ్చుకెళ్తూ నృత్యం చేశాడు. ఒకానోక సందర్భంలో శవం మీద నిలబడి కూడా డ్యాన్స్ చేయడం వీడియోలో కనిపిస్తుంది. అయితే వీరిద్దరికీ ఒకరికొకరు పరిచయం ఉన్నట్లు కనిపించడం లేదని పోలీసులు తెలిపారు. హత్యకు పాల్పడిన బాలుడు బాధిత యువకుడి నుంచి డబ్బు దోచుకోవడానికే ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. బాధిత యువకుడు ప్రతిఘటించడంతో.. నిందితుడు అతనిపై దాడి చేశాడు. మృతుడు చనిపోయాడని నిర్ధారించుకోవడానికి.. అతని మెడపై పదేపదే కత్తితో పొడిచాడు. కాలితో తలను తన్నాడు. మృతదేహంపై నిలబడి నృత్యం చేయడం ప్రారంభించాడు. అనంతరం మృతుడి జేబులో నుంచి డబ్బు తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ భయంకర హత్యకు సంబంధించిన దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. మంగళవారం రాత్రి 11.15 గంటలకు ఈ దారుణం జరిగినట్లు తెలుస్తోంది. బిర్యానీ కొనేందుకు డబ్బు కోసమే నిందితుడు ఈ దారుణానికి పాల్పడ్డాడని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఈశాన్య ) జాయ్ టిర్కీ తెలిపారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని బాధితుడిని ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే అతను చనిపోయినట్లు వైద్యులు దృవీకరించారు. పోలీసులు నిందితుడి ఆచూకీ కోసం సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. ఫోరెన్సిక్ బృందం సంఘటనా స్థలాన్ని సందర్శించింది.
Admin