జై భీమ్ టీవీ - తెలంగాణ / హైదరబాద్ : హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. ముఖ్యనేతలు ఖర్గే, సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీతో భేటీ కానున్నారు. ఈ సందర్భంగా మంత్రివర్గ విస్తరణ, ఎమ్మెల్సీల ఎంపిక సహా పార్లమెంటు ఎన్నికల్లో వ్యవహరించాల్సిన అంశాలపై చర్చించనున్నారు. సోనియాగాంధీని తెలంగాణ నుంచి పోటీ చేయాలని విజ్ఞప్తి చేస్తూ పీఏసీ చేసిన తీర్మానాన్ని అధిష్ఠానానికి అందించనున్నారు. అలాగే, కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, తదితర అంశాలపైనా కేంద్రంలోని ముఖ్యులను కలిసి వారితో చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కాగా, మంగళవారం ఉదయం 9 గంటలకు ఢిల్లీ వెళ్లనున్న రేవంత్ రెడ్డి సాయంత్రానికి హైదరాబాద్ చేరుకోనున్నారు. కాగా కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ.. వచ్చే లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి పోటీ చేయాలని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు కోరుకుంటున్నారు. లోక్సభ ఎన్నికలు మార్చిలోనే వచ్చే అవకాశం ఉండడంతో.. ఇప్పటి నుంచే ఆ ఎన్నికలపై దృష్టి సారించారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన తల్లిగా.. ఈ రాష్ట్రం నుంచి పోటీ చేయాలని సోనియాగాంధీని కోరాలని నిర్ణయించారు. ఈ మేరకు టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సోమవారం ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించింది. ఈ తీర్మానాన్ని సోనియాగాంధీతోపాటు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకూ పంపనుంది. టీపీసీసీ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సైతం సోనియాగాంధీని స్వయంగా కలిసి లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి పోటీ చేయాల్సిందిగా కోరనున్నట్లు చెబుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 65 సీట్లతో బొటాబొటి మెజారిటీతోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నేపథ్యంలో.. వచ్చే లోక్సభ ఎన్నికలను తమకు అనుకూలంగా మలచుకోవాలని యోచిస్తోంది. ఈ ఎన్నికల్లో మెజారిటీ ఎంపీ సీట్లను గెలుచుకుంటే ప్రజాభిప్రాయానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం సుస్థిరత కూడా సాధిస్తుందని పార్టీ నాయకత్వం భావిస్తోంది. దీంతో అగ్రనేత సోనియాగాంధీని రాష్ట్రం నుంచి బరిలోకి దించితే లోక్సభ ఎన్నికలను ప్రభావితం చేయవచ్చన్న యోచనలో ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో సోనియా, రాహుల్ సహా అధిష్ఠానం మొత్తాన్ని ప్రచారంలో కాంగ్రెస్ కేంద్రీకరించిన విషయం తెలిసిందే. వీరి ప్రచారం పార్టీ విజయానికి దోహదపడటంతో లోక్సభ ఎన్నికల్లో ఏకంగా సోనియాగాంధీనే ఇక్కడి నుంచి పోటీకి దించి ప్రజల దృష్టిని మరోమారు ఆకర్షించాలని రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది.
Admin