జై భీమ్ టీవీ - తెలంగాణ / నిర్మల్ జిల్లా : జగిత్యాల : పొరపాటున కాంగ్రెస్ అధికారంలోకి వస్తే బతుకులు ఆగమవుతాయని, కాంగ్రెస్ రాజ్యమంటే పైరవీకారుల రాజ్యం, దళారుల రాజ్యమని ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి రైతుబంధు వద్దంటే.. రేవంత్ రెడ్డి ధరణి వద్దంటున్నాడని, కాంగ్రెస్ వస్తే ప్రజా సంక్షేమ కార్యక్రమాలన్నీ రద్దు కావడం ఖాయమని అన్నారు. గతంలో యాభై ఏళ్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని, మళ్లీ ఇప్పుడు ఒక్క చాన్స్ పేరిట ప్రజల్లోకి వస్తోందని, 50 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ పార్టీ దేశానికి, రాష్ట్రానికి చేసింది ఏమిటని ప్రశ్నించారు. ఆ పార్టీ కల్లబొల్లి కబుర్లకు మోసపోవద్దని హితవు పలికారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్మల్ జిల్లా ఎల్లపెల్లి, నిజామాబాద్ జిల్లా బాల్కొండ; జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలోని వేల్పూర్ ఎక్స్ రోడ్లో గురువారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభల్లో కేసీఆర్ ప్రసంగించారు. గతంలో కాంగ్రెస్ పాలనలో రాబందులు తప్ప రైతు బంధులు లేరని, ఇప్పుడు తెలంగాణలో రైతు బంధు, ఉచిత విద్యుత్తు, పంట ఉత్పత్తులకు మద్దతు ధరలు అందిస్తున్నామని తెలిపారు. ‘‘ధరణి పోర్టల్ రద్దు చేస్తామని రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారు. ఆయనకు ఎద్దు ఎరుకనా, వ్యవసాయం ఎరుకనా!? రైతు బంధు సొమ్ములను ప్రభుత్వం రైతులకు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తోంది. ప్రమాదవశాత్తు చనిపోతే ఆ కుటుంబం అవస్థల పాలు అవద్దని రూ.5 లక్షల బీమా అమలు చేస్తున్నాం. ధాన్యం కొనుగోలు చేసిన డబ్బులు సైతం దళారుల పాత్ర లేకుండా నేరుగా రైతుల ఖాతాల్లో వేస్తున్నాం. మరి, ధరణిని తీసేస్తామని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. అప్పుడు రైతులకు రైతు బంధు, రైతు బీమా, ధాన్యం కొన్న డబ్బులు ఎట్లా రావాలి!?’’ అని ప్రశ్నించారు. ఎన్నికల్లో బీఆర్ఎ్సను తట్టుకోలేని కాంగ్రెస్ వాళ్లు తమ నేతలపై కత్తులతో దాడులు చేస్తున్నారని ఆరోపించారు. గతంలో ట్రాన్స్ఫార్మర్ కాలితే ఒక్కొక్కరు రూ.2000 జమ చేసి ఇస్తే కానీ పనులు కాని సందర్భాలు ఉండేవని, ఇప్పుడు పైసా ఖర్చు లేకుండా కొత్త ట్రాన్స్ఫార్మర్ బిగిస్తున్నామని చెప్పారు. దళిత బంధు పెట్టాలని ఎవరూ అడగలేదని, స్వయంగా ఆలోచించి ప్రారంభించానని, ధర్మపురి నియోజకవర్గంలో బీఆర్ఎస్ గెలిస్తే సెగ్మెంట్ మొత్తానికి ఒకే విడతగా అర్హులందరికీ దళిత బంధు అందిస్తానని హామీ ఇచ్చారు. దళితులను అన్ని రాజకీయ పార్టీలు ఓటు బ్యాంకుగా వాడుకున్నాయని, దేశంలోనే దళిత బంధు అనే పథకాన్ని తీసుకొచ్చిన తొలి రాష్ట్రం తెలంగాణే అని అన్నారు. దేశ మొదటి ప్రధాని నెహ్రూ దళితులను అప్పుడే పట్టించుకుని ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి ఉండేది కాదన్నారు. కాంగ్రెస్ పాలనతో దళితులకు నష్టం జరిగిందన్నారు. ఆర్థిక పరిస్థితి పెరిగిన కొద్దీ పెన్షన్ను పెంచుకుంటూ పోతామని, వచ్చే మార్చి తర్వాత పింఛనును పెంచుతూ 5 వేల వరకూ తీసుకువెళ్తామని తెలిపారు. చేనేత, గీత, భవన నిర్మాణ కార్మికులు బీమా కావాలని అడుగుతున్నారని, తెల్ల రేషన్ కార్డు ఉన్నవారందరికీ బీమాను వర్తింపజేస్తామని చెప్పారు. రైతులకు అన్నీ ఉచితంగానే ఇస్తున్నామని, కరెంటు కోతలు విధించే కాంగ్రెస్ కావాల్నో 24 గంటలు విద్యుత్ అందించే బీఆర్ఎస్ కావాలో నిర్ణయించుకోవాలని సీఎం పిలుపునిచ్చారు. ప్రజల హక్కుల రక్షణ కోసం, వారి బాగు కోసం పుట్టిందే బీఆర్ఎస్ పార్టీ అని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్య పరిణతి రాలేదు దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అయినా.. ప్రజాస్వామ్య పరిణతి ఇంకా పూర్తిగా రాలేదని, ఇది దేశానికి ప్రమాదమని సీఎం కేసీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య పరిణతి సాధించిన దేశాలు వేగంగా ముందుకు దూసుకు వెళుతున్నాయని, దేశంలో అన్ని వ్యవస్థలు కుంటుపడడానికి పరిణతి రాకపోవడమే కారణమని చెప్పారు. పాలకులను ఎన్నుకునే ముందు మంచి చెడులు ఆలోచించాలని, వజ్రాయుధం వంటి ఓటుతో ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే పార్టీని గెలిపించాలని పిలుపునిచ్చారు. పదేళ్ల తమ పాలనలో కరువు కాటకాలు రాలేదని, కర్య్ఫూలు, మత కల్లోలాలు లేవని, ప్రజలు స్వేచ్ఛాయుత వాతావరణంలో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడానికి తమ పాలనే కారణమని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో న్యాయంవైపు నిలవాలని, తాము చేపట్టిన పనులపై చర్చించి ఓటు ఎవరికి వేయాలో నిర్ణయం తీసుకుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ‘‘ఎన్నికల సీజన్లో ఎవరో వచ్చి ఏదో మాట్లాడుతున్నారు. అభ్యర్థి ఏ పార్టీలో ఉన్నాడు!? ఏ పార్టీ చరిత్ర ఏంటి!? ఏ పార్టీ ప్రజలకు ప్రయోజనం కలిగించింది!? అనేవి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి’’ అని సూచించారు. ఓటు అనేది మన కిస్మత్ను నిర్ణయిస్తుందని, ప్రజల గెలుపే నిజమైన ప్రజాస్వామ్యమని అన్నారు. ప్రధాని మోదీకి పిచ్చి పట్టింది ప్రధాని మోదీకి పిచ్చి పట్టిందని, ప్రైవేటీకరణ పిచ్చితో రైళ్లు, విమానాలు, ఓడ రేవులను ప్రధాని ప్రైవేటుపరం చేస్తున్నారని సీఎం కేసీఆర్ విమర్శించారు. కరెంటు కూడా ప్రైవేటుపరం చేయడంతోపాటు మోటార్లకు మీటర్లు పెట్టాలని బెదిరించాడని, అయినా, తాను భయపడలేదని, మోటార్లకు మీటరు పెట్టను.. ఏం చేసుకుంటావో చేసుకోమని అన్నానని వివరించారు. దాంతో, ఏడాదికి ఐదు వేల కోట్ల రూపాయల కోత విధిస్తున్నారని, అయినా, పట్టించుకోవడం లేదని తెలిపారు.
Admin