జై భీమ్ టీవీ - తెలంగాణ / : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో కారు దిగి చెయ్యిని అందుకున్న మాజీ మంత్రి, మాజీ ఎంపీ వెంట నడిచేందుకు కదులుతున్నారు గులాబీ నేతలు. పలువురు బీఆర్ఎస్ నేతల ఇళ్లకు వెళ్లి మరీ చర్చలు జరుపుతున్నారు. తాజాగా మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణతో పాటు, నలుగురు కార్పొరేటర్లు బీఆర్ఎస్కు రాజీనామా చేశారు. త్వరలోనే కాంగ్రెస్లో చేరతామని ప్రకటించారు. వీరి దారిలోనే మరి కొందరు నేతలు నడుస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే అసంతృప్తి నేతలకు గాలం వేసి.. తమవైపు తిప్పుకునేందుకు ఇద్దరు నేతలు వ్యూహాత్మకంగా వ్యవహారిస్తున్నారు. ఖమ్మం జిల్లాలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇద్దరు నేతలు కలిసి ఆపరేషన్ ఆకర్ష్కు తెరలేపారు. గత కొద్దిరోజులుగా అధిష్టానం పట్ల అసంతృప్తిగా ఉన్న మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ బీఆర్ఎస్ పార్టీ వీడారు. దీంతో తుమ్మల, పొంగులేటి ఆయన నివాసానికి వెళ్లి మరీ చర్చలు జరిపారు. కాంగ్రెస్లోకి సాదరంగా ఆహ్వానించారు. త్వరలోనే తానూ కాంగ్రెస్లో చేరతానని ప్రకటించారు లక్ష్మీనారాయణ. ఈ సందర్భంగా పార్టీకి రాజీనామా చేయడానికి గల కారణాలను వివరించారు. బిసి నేత అయిన తనను పార్టీలో ఇబ్బందులకు గురి చేసి.. అవమానపరిచారని బాలసాని ఆవేదన వ్యక్తం చేశారు. భద్రాచలం నియోజక వర్గం పార్టీ ఇన్ ఛార్జ్గా నియమించారని.. అయితే తనను కాదని ఎన్నికల ఇన్ఛార్జ్గా ఎమ్మెల్సీ తాతా మధు ను నియమించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. దీన్నంతటిని చూస్తుంటే తనను అవమానించడానికి జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. బాలసాని. బీఆర్ఎస్లో బిసిలకు స్థానం లేదా అని ప్రశ్నించారు. సుదీర్ఘ కాలం రాజకీయ అనుభవం కలిగిన తనకు పదవులు అవసరం లేదన్నారు. ఆత్మ గౌరవం కావాలన్నారు ఎమ్మెల్సీ లక్ష్మీనారాయణ. ఖమ్మం జిల్లాలో ఆట ఇప్పుడే మొదలైందని పొంగులేటి వ్యాఖ్యలు చేశారు. వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే అన్నారు. అధికారులు పరిమితులు దాట ప్రవర్తిస్తే.. భవిష్యత్లో ఇబ్బందులు తప్పవని తుమ్మల హెచ్చరించారు. మిమ్మల్ని ఎవరూ కాపాడరన్నారు. ప్రజాస్వామ్య పాలన కోసమే తామిద్దరం కాంగ్రెస్ పార్టీలో చేరామని స్పష్టం చేశారు. ప్రజా సంక్షేమం కోసం అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. తుమ్మల ,పొంగులేటి ఇద్దరూ కలిసి.. ఖమ్మంలో పలువురు బీఆర్ఎస్ కార్పొరేటర్ల ఇళ్లకు వెళ్లి చర్చలు జరపారు. దీంతో నలుగురు బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఆ పార్టీకి రాజీనామా చేశారు. త్వరలోనే వారు కాంగ్రెస్లో చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. అదే బాటలో మరి కొందరు బీఆర్ఎస్ నేతలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామాలు జిల్లా రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అయితే గత కొంత కాలంగా అసంతృప్తిగా ఉన్న బాలసానిని.. మంత్రి పువ్వాడ అజయ్, ఎంపీ గాయత్రి రవి వ్యక్తిగతంగా చర్చలు జరిపి బుజ్జగించారు. అయినా నాయకుల రాయభారం ఫలించలేదు. ఇదిలావుంటే బాలసాని లక్ష్మీనారాయణ, తుమ్మల కు ప్రధాన అనుచరుడు. తెలుగుదేశం పార్టీలో ఆయనతో కలిసి పని చేశారు. బిసి వర్గానికి చెందిన సీనియర్ నేత బాలసాని రాజీనామాతో ఆ ప్రభావం ఎంత మేరకు చూపుతుందన్న చర్చ జరుగుతోంది. తుమ్మల, పొంగులేటి ఇద్దరూ కలిసి స్పీడ్ పెంచారు. రానున్న రోజుల్లో వీరు ఎలాంటి వ్యూహాలు అమలు చేస్తారు.. ఇంకా ఎవరెవరు బీఆర్ఎస్ నేతలను కాంగ్రెస్లోకి తీసుకెళ్తారన్నదీ సంచలనంగా మారింది..!
Admin