జై భీమ్ టీవీ - తెలంగాణ / హైదరబాద్ : ఎమ్మెల్సీ కవిత, రేవంత్ మధ్య ట్వీట్వార్. దీక్షా దివస్పై వ్యంగ్యంగా ట్వీట్ చేసిన కామెంట్కు అదే రీతిలో కౌంటర్ ఇచ్చారు కవిత. పప్పన్నం తిని, బోనం ఎత్తినందుకే సకల సౌకర్యాలు అనుభవిస్తున్నారని రేవంత్ అంటే.. బోనం ఎత్తిన ఆడపడుచులను అవమానిస్తారా అంటూ ప్రశ్నించారు కవిత తెలంగాణ బిడ్డలు చేసిన ప్రతి బలిదానం కాంగ్రెస్ చేసిన హత్యేనని ఆరోపించారు MLC కల్వకుంట్ల కవిత. తెలంగాణ ద్రోహులకు అడ్డా కాంగ్రెస్ పార్టేనని, దీక్షా దీవస్ సందర్భంగా ట్విట్టర్ వేదికగా కవిత ఫైరయ్యారు. రాష్ట్రాన్ని ఇస్తామని చెప్పి వెనక్కి తగ్గి రాష్ట్ర ఏర్పాటుపై కాలయాపన చేసినందుకే వేలాది మంది తెలంగాణ యువకులు రాష్ట్ర సాధన కోసం బలిదానం చేశారని ట్వీట్ చేశారు కవిత. ప్రజా పోరాటాలను అపహాస్యం చేయడం అలవాటుగా మార్చుకున్న కాంగ్రెస్ పార్టీని దేశమంతా ప్రజలు తిరస్కరిస్తున్నా బుద్ధి రావడం లేదన్నారు కవిత. తెలంగాణ కోసం ప్రజా ఉద్యమం ప్రారంభించిన కేసీఆర్ , దేశంలోని 39 పార్టీల మద్దతు కూడగట్టి, యూపీఏ ప్రభుత్వం మెడలు వంచి, తెలంగాణ రాష్ట్రం తెచ్చారు అని ట్వీట్లో పేర్కొన్నారు. సొంత నియోజకవర్గం అమేథిలో గెలుస్తానన్న నమ్మకం లేకే రాహుల్గాంధీ కేరళలోని వయనాడ్ వెళ్లారన్నారు. తానూ ఎంపీగా ఓడిపోయినా అక్కడే స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీకి పోటీ చేసి గెలిచానని కవిత స్పష్టం చేశారు.
Admin