జై భీమ్ టీవీ - తెలంగాణ / : ఎన్నికలు సమీపిస్తున్నప్పటికీ.. తెలంగాణ కాంగ్రెస్లో అభ్యర్థుల టెన్షన్ నెలకొంది. ఫస్ట్ లిస్ట్లో 55మంది అభ్యర్ధుల్ని, సెకండ్ లిస్ట్లో 45మంది అభ్యర్ధుల్ని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. రీసెంట్గా మూడో జాబితా కూడా అనౌన్స్ చేసింది. రెండు స్థానాల్లో అభ్యర్ధుల్ని మార్చుతూ 16మందితో థర్డ్ లిస్ట్ ప్రకటించింది. ఇంకా నాలుగు సీట్లను పెండింగ్లో పెట్టింది. అయితే, నాలుగింటిలో మూడింటిపై ఎడతెగని పంచాయితీ కొనసాగుతోంది. ఆ మూడు సీట్లూ కూడా ఉమ్మడి నల్గొండ జిల్లాలోనివే కావడం చర్చనీయాంశంగా మారింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని.. తుంగతుర్తి, సూర్యాపేట, మిర్యాలగూడ.. ఈ మూడింటిపైనే తెలంగాణ కాంగ్రెస్లో పంచాయితీ కొనసాగుతోంది. చర్చల మీద చర్చలు జరుపుతున్నా పంచాయితీ మాత్రం తెగడం లేదు. మూడు జాబితాలు ప్రకటించినా ఈ మూడు సీట్లపై మాత్రం కాంగ్రెస్ హైకమాండ్ ఎటూ తేల్చుకోలేకపోతోంది. సూర్యాపేట, తుంగతుర్తి, మిర్యాలగూడ టికెట్ల కోసం హోరాహోరీ ఫైట్ నెలకొనడంతో.. అభ్యర్ధుల ఎంపికపై అధిష్టానం తల పట్టుకుంటోంది. ఒకవైపు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఇంకోవైపు ఉత్తమ్కుమార్రెడ్డి, మరోవైపు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి.. తమ వాళ్ల కోసం హోరాహోరీగా తలపడుతున్నారు. ఈ మూడు సీట్లపై కాంగ్రెస్ సీఈసీ మీటింగ్స్లో కూడా తీవ్ర వాగ్వాదాలు జరిగినట్లు సమాచారం.. తుంగతుర్తిలో ఆరుగురి మధ్య పోటీ.. తుంగతుర్తి, ఇది ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం.. ఇక్కడ ఏకంగా ఆరుగురు టికెట్ కోసం పోటీపడుతున్నారు. అద్దంకి దయాకర్, డా.రవి, ప్రీతం, కృష్ణవేణి మధ్య హోరాహోరీ వార్ జరుగుతోంది. టికెట్ కోసం నువ్వానేనా అని పోటీపడుతున్నారు ఈ నలుగురు. ఈ రేస్లోకి రీసెంట్గా వచ్చిచేరారు మోత్కుపల్లి నర్సింహులు, మందుల సామేల్. దీంతో ఆరుగురిలో ఎవరిని ఎంపిక చేస్తారన్నది పార్టీలో టెన్షన్ నెలకొంది. అద్దంకి దయాకర్, ఇక్కడ్నుంచి రెండుసార్లు పోటీచేసి స్వల్ప తేడాతో ఓడిపోయారు. కాంగ్రెస్ పార్టీకి నమ్మకస్తుడిగా ఉన్నారు. రేవంత్ వర్గంగా ముద్రపడ్డారు. డా.రవి, ప్రీతం కూడా తుంగతుర్తి రేస్లో ఉన్నా కృష్ణవేణి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. కృష్ణవేణికి టికెట్ ఇప్పించేందుకు కోమటిరెడ్డి తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. కొత్తగా పార్టీలో చేరిన మోత్కుపల్లి నర్సింహులు పేరు కూడా తెరపైకి వచ్చింది. ఇక్కడ మాదిక సామాజికవర్గ ఓట్లు అధికంగా ఉండటంతో మోత్కుపల్లి పేరును కూడా పరిశీలిస్తున్నట్టు టాక్. అలాగే, మందుల సామేల్ పేరు కూడా రేస్లో వినిపిస్తోంది. సూర్యాపేట నియోజకవర్గంలో.. సూర్యాపేటలో పటేల్ రమేష్రెడ్డి, దామోదర్రెడ్డి మధ్య హోరాహోరీ ఫైట్ నడుస్తోంది. టికెట్ కోసం నువ్వానేనా అన్నట్టుగా తలపడుతున్నారు ఇద్దరు. పటేల్ రమేష్రెడ్డి అభ్యర్ధిత్వం కోసం రేవంత్రెడ్డి పట్టుబడుతున్నట్టు సమాచారం. మిర్యాలగూడలో.. మిర్యాలగూడలోనూ ఇదే పరిస్థితి. బత్తుల లక్ష్మారెడ్డి, శంకర్నాయక్ మధ్య టఫ్ ఫైట్ నడుస్తోంది. బత్తుల లక్ష్మారెడ్డికి టికెట్ ఇవ్వాలంటూ ఉత్తమ్, కోమటిరెడ్డి కలిసి ప్రయత్నిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.
Admin