జై భీమ్ టీవీ - తెలంగాణ / : తెలంగాణలో కాంగ్రెస్ తాజాగా మేనిఫెస్టో విడుదల చేసిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన విడుదల చేసిన ఈ మేనిఫెస్టోను అభయహస్తం పేరుతో విడుదల చేసింది. అయితే తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ప్రభుత్వ పరీక్షలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఒక్క రూపాయి కూడా అప్లికేషన్ ఫీజు కట్టవలసిన అవసరం లేదని మేనిఫెస్టోలో పేర్కొంది. తాజా మేనిఫెస్టోలో జాబ్ క్యాలెండర్ కూడా కాంగ్రెస్ ప్రకటించింది. అందులో గ్రూప్ 1, 2, 3, 4 పరీక్ష నిర్వహణ తేదీలను సైతం ప్రకటించింది. గ్రూప్ -1 నోటిఫికేషన్ ఒక్కసారి విడుదల చేస్తామని, గ్రూప్ 2, 3, 4 నోటిఫికేషన్లు మాత్రం రెండు విడతలుగా విడుదల చేస్తామని తెల్పింది. అలాగే గ్రూప్స్తో పాటు 13 విభాగాలకు చెందిన ప్రభుత్వ ఉద్యోగాలను సైతం భర్తీ చేస్తామని నిరుద్యోగ యువతకు కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఈ క్రమంలో గ్రూప్స్ పరీక్షల తేదీలు, నోటిఫికేషన్లు విడుదల చేసే తేదీలు, కానిస్టేబుల్ పరీక్షల నోటిఫికేషన్ తేదీలను కూడా ప్రకటించింది. కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రకారం.. ఉద్యోగాల నోటిఫికేషన్లు.. అవి వెలువడే తేదీలు ఇలా.. వచ్చే ఏడాది మార్చి 1వ తేదీన, డిసెంబర్ 15వ తేదీన కానిస్టేబుల్ పోస్టులతో పాటు ఇతర యూనిఫామ్ జాబ్ల నోటిఫికేషన్ విడుదల చేస్తామని పేర్కొంది గ్రూపు-1 ఉద్యోగాల కోసం 2024 ఫిబ్రవరి 1న నోటిఫికేషన్ విడుదల గ్రూపు-2 ఉద్యోగాల నోటిఫికేషన్ 2024 ఏప్రిల్ 1న విడుదల గ్రూపు-3 నోటిఫికేషన్ జూన్1, డిసెంబరు 1న రెండు విడతలగా విడుదల గ్రూపు-4 నోటిఫికేషన్ జూన్ 1, డిసెంబరు 1న రెండు విడతలుగా విడుదల కాగా తెలంగాణలో నవంబర్ 30వ తేదీన అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రధాన రాజకీయ పార్టీలు ఓటర్లను ఆకర్షించేందుకు తాయిలాలను ఆశ చూపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ రోజు విడుదల చేసిన కాంగ్రెస్ మేనిఫెస్టోలో నిరుద్యోగ యువత ఓట్లను ఆకర్షించేందుకు ఇలా ఉద్యోగ ప్రకటనలకు సంబంధించిన అంశాలను మేనిఫెస్టోలో ప్రకటించింది. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే టీఎస్పీయస్సీ ప్రక్షాలన చేయడంతో పాటు వరుస ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తామని హామీలు ఇస్తోంది. మరో వైపు బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు కూడా ఓట్లను రాబట్టేందుకు బాగానే తాయిలాలు సిద్ధం చేసుకుంటున్నారు.
Admin