జై భీమ్ టీవీ - తెలంగాణ / : తెలంగాణ కాంగ్రెస్లో మహిళా ఫైర్ బ్రాండ్గా ప్రత్యేక ముద్ర వేసుకున్న ములుగు ఎమ్మెల్యే సీతక్క ఇప్పుడు ఆ పార్టీకి సెంటిమెంట్గా మారారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఈ కార్యక్రమం మొదలు పెట్టినా సీతక్క ప్రాతినిధ్యం వహిస్తున్న ములుగు నియోజకవర్గం నుండే సెంటిమెంట్గా కార్యక్రమాలు ప్రారంభిస్తున్నారు కాంగ్రెస్ నేతలు. అక్కడి దేవుళ్ళ మహత్యమో.. లేక చెల్లెమ్మ సీతక్క సెంటిమెంట్ ఏమో కానీ తెలంగాణ పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి కూడా ములుగు నియోజకవర్గం నుండే తన పాదయాత్ర చేపట్టి దిగ్విజయంగా పూర్తి చేశారు. మేడారం సమ్మక్క సారక్క దేవతల సన్నిధి నుండి తన పాదయాత్ర చేపట్టిన రేవంత్ రెడ్డి తెలంగాణలోని అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో కలుపుతూ పూర్తి చేశారు.. తాజాగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి శంఖం పూరించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం కూడా ఇప్పుడు అదే నియోజకవర్గం నుండి ప్రచారానికి సన్నాహాలు చేస్తున్నారు. సీతక్క ప్రాతినిధ్యం వహిస్తున్న ములుగు నియోజకవర్గంలోని రామప్ప దేవాలయం నుండే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ బస్సు యాత్ర ప్రారంభించనున్నారు. అక్టోబర్ 18వ తేదీ సాయంత్రం నాలుగు గంటలకు ప్రత్యేక హెలికాప్టర్ లో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ రామప్పకు చేరుకుంటారు. రామప్పలో దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అక్కడి నుండి ఎన్నికల ప్రచారానికి శంఖం పూరిస్తారు.. అక్కడి నుండి నేరుగా వెంకటాపురం మండలంలోని రామంజపురం గ్రామానికి భారీ ర్యాలీగా చేరుకుంటారు.. రామాంజపురం బహిరంగ సభలో పాల్గొని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ లో చేపట్టబోయే కార్యక్రమాలు మేనిఫెస్టోను తెలంగాణ ప్రజలకు వివరిస్తారు. అనంతరం 35 కిలోమీటర్ల మేర రోడ్డు మార్గాన బసు యాత్ర ఉంటుంది. నేరుగా భూపాలపల్లి లో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. తెలంగాణ రాష్ట్రంలో అక్టోబర్ 18,19, 20 మూడు రోజులపాటు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల బస్సుయాత్ర కొనసాగనుంది. ఈ కార్యక్రమానికి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రూట్ మ్యాప్ రెడీ చేసింది. అయితే సెంటిమెంటుగా సీతక్క ప్రాతినిధ్యం వహిస్తున్న ములుగు నియోజకవర్గ నుండే ఈ పాదయాత్ర బస్సుయాత్ర ప్రారంభించడం.. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణ కాంగ్రెస్ కు సీతక్క సెంటిమెంట్గా మారిందని భావిస్తున్నారు. ఈ సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందా..? కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందో లేదో చూడాలి..
Admin