జై భీమ్ టీవీ - తెలంగాణ / : ఖమ్మం రాజకీయమంతా ఆ ఇద్దరి చుట్టే తిరుగుతోంది. కొన్నిరోజుల తేడాతో ఆ ఇద్దరు సీనియర్లు కండువా మార్చారు. అధికార పార్టీకి గుడ్బై చెప్పి కాంగ్రెస్లోకొచ్చారు. ఖమ్మంలో కాంగ్రెస్ సమీకరణాల్లో కీలకంగా మారిన ఆ ఇద్దరూ ఇప్పుడు సీట్లు మార్చుకుంటున్నారు. అవును..వాళ్లకిష్టమై మార్చుకోవడం లేదు. పార్టీ అధినాయకత్వం అన్ని లెక్కలూ వేసుకుంది. ఆ ఇద్దరినీ ఒప్పించింది. అగ్రనేతలే స్వయంగా చెప్పటంతో పార్టీ ప్రతిపాదనకు ఒప్పుకున్నారు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్రెడ్డి. ఖమ్మం నుంచి తుమ్మల నాగేశ్వరరావు, పాలేరునుంచి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి. ఇదీ కాంగ్రెస్ తాజా ప్రతిపాదన. పాలేరు నుంచి తుమ్మల, ఖమ్మంనుంచి పొంగులేటి పోటీ చేస్తారనుకుంటే ఒక్కసారిగా మారిపోయింది ఈక్వేషన్. పాలేరు సీటుకోసం మొదట్నించీ పట్టుబడుతూ వచ్చారు తుమ్మల నాగేశ్వరరావు. కాంగ్రెస్లో షర్మిల పార్టీ విలీనం విషయంలోనూ ఆ సీటు దగ్గరే పీటముడి పడింది. ఒకప్పుడు మంత్రిగా తాను ప్రాతినిధ్యం వహించిన పాలేరు ప్రజల రుణం తీర్చుకోవాలన్నది తుమ్మల టార్గెట్. అక్కడ ఆయనకు కొన్ని లక్ష్యాలున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే కందాల ఉపేందర్రెడ్డికే బీఆర్ఎస్ టికెట్ ఇవ్వటంతో.. తుమ్మల అసంతృప్తికి గురయ్యారు. చివరికి కాంగ్రెస్లో చేరారు. పాలేరు టికెట్ హామీతోనే ఆయన కాంగ్రెస్లోకొచ్చారన్న ప్రచారం ఉంది. దానికి తగ్గట్లే అక్కడినుంచే ఆయన పోటీ చేస్తారన్న సంకేతాలొచ్చాయి. కానీ ఈలోపే కాంగ్రెస్ నాయకత్వం ఆయన్ని ఖమ్మంనుంచి పోటీకి దించాలని డిసైడైంది. కాంగ్రెస్లో చేరిన మరో కీలక నేత పొంగులేటి శ్రీనివాస్రెడ్డి మొదట కొత్తగూడెంనుంచి పోటీ చేయాలనుకున్నారు. కానీ లెఫ్ట్ పార్టీలతో పొత్తుతో అక్కడ సాధ్యమయ్యేలా లేకపోవటంతో పాలేరుపై గురిపెట్టారు. దీంతో పాలేరు విషయంలో తుమ్మల-పొంగులేటి మధ్య క్లాష్ తప్పదనుకున్నారు. కానీ ఇద్దరితో కాంగ్రెస్ పెద్దలు మాట్లాడి తుమ్మలకే పాలేరు వదిలేసేలా పొంగులేటిని ఒప్పించారన్న ప్రచారం జరిగింది. దీంతో ఖమ్మంనుంచి పోటీకి పొంగులేటి కూడా మానసికంగా సిద్ధపడ్డారు. కానీ టికెట్ల ప్రకటనకు ముందు పార్టీ అగ్రనాయకత్వం ఆలోచనతో సమీకరణాలు మారిపోయాయి. పాలేరు నుంచి పొంగులేటి శ్రీనివాస్రెడ్డే సరైన అభ్యర్థి అన్న నిర్ణయానికొచ్చిందట కాంగ్రెస్ హైకమాండ్. 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్కి ఒకే ఒక సీటొచ్చిన ఖమ్మం జిల్లాలో క్వీన్స్వీప్ చేయాలన్న టార్గెట్తో ఉంది కాంగ్రెస్ పార్టీ. బీఆర్ఎస్ గెలుచుకున్న ఆ ఒక్క సీటు చుట్టే కాంగ్రెస్లో చర్చ జరిగింది. అధికార పార్టీకి అవకాశం ఇవ్వొద్దన్న వ్యూహంతోనే తుమ్మల, పొంగులేటి సీట్లు మార్చేయాలన్న నిర్ణయం జరిగిందంటున్నారు. పొంగులేటిని ఖమ్మంలో దించితే కీలక సామాజికవర్గం ఓట్లు బీఆర్ఎస్కి అనుకూలంగా పోలరైజ్ అవుతాయని కాంగ్రెస్ అనుమానించింది. అందుకే మంత్రి పువ్వాడపై అదే సామాజికవర్గానికి చెందని తుమ్మలనే బలమైన అభ్యర్థి అవుతారని భావించింది. తుమ్మల బరిలో ఉంటే కచ్చితంగా గెలిచే అవకాశం ఉందన్న అంచనాకొచ్చిందట కాంగ్రెస్ పార్టీ. పాలేరు రెడ్ల ప్రాబల్యమున్న నియోజకవర్గం కావటంతో ఆ వర్గానికి చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై తుమ్మలకంటే పొంగులేటి గట్టి పోటీ ఇస్తారని లెక్కలేసుకుంది కాంగ్రెస్. ఆ నియోజకవర్గంలో తుమ్మలకున్న బలం పార్టీకి ఎలాగూ కలిసొస్తుంది. దీంతో పాలేరులో కూడా బీఆర్ఎస్కి గట్టి చెక్ పెట్టొచ్చన్న వ్యూహంతో పార్టీ ఉంది. పైగా 2018 ఎన్నికల్లో అది కాంగ్రెస్ గెలిచిన సీటే కావటంతో అన్నీ అనుకూలిస్తాయని అంచనా వేసుకుంటోంది కాంగ్రెస్ అగ్రనాయకత్వం. పాలేరుకు పొంగులేటి, ఖమ్మంకి తుమ్మల నాగేశ్వరరావుని సెట్ చేయటంతో కొత్తగూడెంలో సీపీఐకి లైన్ క్లియరైనట్లే కనిపిస్తోంది. పాలేరు నుంచి పోటీ విషయంలో పట్టుదలతో ఉన్న తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ నాయకత్వ ప్రతిపాదనకు ఒప్పుకున్నారా అన్న చర్చ జరుగుతోంది. అయితే స్వయంగా అగ్రనేతలే జోక్యం చేసుకోవటంతో ఖమ్మం నేతలిద్దరూ ఓకే చెప్పారని సమాచారం. ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీని కలుసుకున్నారు తుమ్మల. రాహుల్ ద్వారానే తుమ్మలని కాంగ్రెస్ నాయకత్వం ఒప్పించిందంటున్నారు. ఖమ్మంలో మంత్రి పువ్వాడతో తలపడేందుకు బలమైన కమ్మ అభ్యర్థి అవసరమని, తుమ్మల రూపంలో ఆ లోటు తీరిందనుకుంటోంది కాంగ్రెస్ పార్టీ. కమ్మ సామాజికవర్గంతో పాటు తండ్రి కమ్యూనిస్టుపార్టీ నేపథ్యం పువ్వాడకు కలిసొస్తున్నాయి. దాన్ని బ్రేక్ చేయాలంటే తుమ్మల నాగేశ్వరరావుతోనే సాధ్యమనుకుంది కాంగ్రెస్. అందుకే పాలేరుపై పట్టుదలగా ఉన్నా.. కాంగ్రెస్ పెద్దల మాటకాదనలేక ఖమ్మంలో పువ్వాడ మీద తొడగొట్టబోతున్నారు తుమ్మల.
Admin