జై భీమ్ టీవీ - తెలంగాణ / : తెలంగాణలో అసెంబ్లీ షెడ్యూల్ తర్వాత వివిధ పార్టీల నేతల హడావిడి ఎక్కువైపోయింది. ఒకరిపై ఒకరు మాటల యుద్ధాలకు దిగుతున్నారు. అటు అధికార పార్టీ నేతలు, ప్రతిపక్ష పార్టీల నేతలు ఒకరిపై ఒకరు విమర్శల వర్షం కురిపించుకుంటున్నారు. తాజాగా మంత్రి హరీష్రావు కాంగ్రెస్ పాలనపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పాలనలో కాలిపోయే మోటర్లు.. కరెంటు కటకటలు.. కరువులు కర్ఫ్యూలే ఎక్కువ అని ఆరోపించారు. అయితే బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో భారీ బహిరంగ సభ ఏర్పాట్లు చేస్తోంది. జనగామ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి స్వాగత సభ, 16వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభ విజయవంతం కోసం నియోజకవర్గ స్థాయి సన్నాహక సదస్సులో మంత్రులు హరీశ్రావు, సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్రావు, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి, పల్లా రాజేశ్వర్రెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్రావు మాట్లాడారు. సీఎం కేసీఆర్కు జనగామ అంటే ఎంతో ప్రేమ అని అన్నారు. 2001లోనే ప్రతి మండలంలో గులాబీ జెండా ఎగిరినగడ్డ: 2001 సంవత్సరంలో ప్రతి మండలంలో గులాబీ జెండా ఎగిరినగడ్డ అని వ్యాఖ్యానించారు. అసెంబ్లీ ఎన్నికల్లో జనగామలో గులాబీ జెండా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ ఢిల్లీని సైతం కదిలించి తెలంగాణ సాధించారని, రాష్ట్రం కోసం ఉమ్మడి రాష్ట్రంలో గులాబీ జెండా కప్పుకున్న ఎమ్మెల్యేలు రాజీనామా చేశారన్నారు. అయితే 2010లో తెలంగాణల ఉద్యమ సమయంలో పల్లా రాజేశ్వర్రెడ్డి పరిచయం అయ్యారని, సీఎం సభ లక్ష మందితో జరగాలన్నారు. నిర్వహించే సభను కార్యకర్తలు ముందుండి నడిపించాలని, కార్యకర్తల కాళ్లు కడిగి నెత్తిన పోసుకున్నా తక్కువేనని వ్యాఖ్యానించారు. నిండు మనసుతో దీవించడమే బీఆర్ఎస్ క్రమ శిక్షణ: ఇక నిండు మనసుతో దీవించడమే బీఆర్ఎస్ క్రమశిక్షణ అని, కాంగ్రెస్ మాట్లాడే మాటలు కుర్చీ కోసమేనని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి 11 సార్లు అవకాశం ఇచ్చినా.. చేసిందేమి లేదని దుయ్యబట్టారు. కాంగ్రెస్ హయాంలో ఎక్కడ కూడా అభివృద్ధి జరగలేదని ఆరోపించారు. కాంగ్రెస్ చేయలేని అభివృద్ధి కేసీఆర్ చేసి చూపించాడన్నారు. కాంగ్రెస్కు వేసిన ఓటు వృధానేనని15న సీఎం కేసీఆర్ మేనిఫేస్టోను ప్రకటిస్తారని, 16న జనగామ బహిరంగ సభకు హాజరవుతారని అన్నారు. కాంగ్రెస్ చేసేవి అట్టి మాటలేనని, బీఆర్ఎస్ మాత్రం చేతల ప్రభుత్వమని పేర్కొన్నారు. 2009లో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను తుంగలో తొక్కిందని, కేసీఆర్ మేనిఫెస్టోను పూర్తి స్థాయిలో అమలు చేశారన్నారు. సీఎం కేసీఆర్ పేద ప్రజల కోసం ఆలోచిస్తారని పేర్కొన్నారు.
Admin