జై భీమ్ టీవీ - తెలంగాణ / : పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య మధ్య మాటల యుద్ధం చెలరేగుతుంది. పొన్నాలపై మండిపడుతూ నిన్న రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 40 ఏళ్లు పార్టీ ఆయనకు ఎంతో ఇచ్చిందన్నారు. ఇప్పుడు పార్టీ మారేందుకు ఆయనకు సిగ్గు లేదా? అంటూ తీవ్రస్థాయిలో విరుచుకపడ్డారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఇవాళ ఆగ్రహంతో ఊగిపోయారు పొన్నాల. కాంగ్రెస్ పార్టీకి పొన్నాల రాజీనామా అనంతరం తెలంగాణలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన పొన్నాలను మంత్రి కేటీఆర్ బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. స్వయంగా పొన్నాల ఇంటికి వెళ్లిన కేటీఆర్.. 45 నిముషాల పాటు ఆయనతో చర్చలు జరిపారు. బీఆర్ఎస్ పార్టీలోకి రావాలని కోరారు. పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. తమ ఆహ్వానంపై పొన్నాల సానుకూలంగా స్పందించినట్టు తెలిపారు మంత్రి కేటీఆర్. అటు పొన్నాల లక్ష్మయ్య పట్ల రేవంత్ రెడ్డి వ్యవహరించిన తీరుపై మంత్రి కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. 40 ఏళ్లు కాంగ్రెస్లో ఉన్న వ్యక్తి పట్ల ఇలా వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. పొన్నాల తమ పార్టీలోకి వస్తే సముచిత స్థానం కల్పిస్తామన్నారు. అయితే ఆదివారంనాడు సీఎం కేసీఆర్తో చర్చల తర్వాత పొన్నాల చేరికపై స్పష్టత రానుంది.
Admin