జై భీమ్ టీవీ - తెలంగాణ / : తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ మరింత జోష్ పెంచింది. ఓ వైపు అసంతృప్తులను బుజ్జగిస్తూనే…మరోవైపు ఆపరేషన్ గులాబీ కంటిన్యూ చేస్తోంది. చాలా కాలం పెండింగ్లో ఉన్న బీఆర్ఎస్ నర్సాపూర్ సీటుపై ఉత్కంఠ వీడింది. నర్సాపూర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డిని సిఎం కేసీఆర్ ప్రకటించారు. నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్రెడ్డితో కలిసి ఆమెకు బీఫామ్ అందచేశారు. ఇక మదన్రెడ్డికి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ ఎంపీ అభ్యర్థిగా అవకాశం ఇవ్వాలని పార్టీ నిర్ణయించింది. ఒక్క అవకాశం ఇవ్వమంటున్న కాంగ్రెస్ మాటలు నమ్మి మోసపోవద్దని మంత్రి కేటీఆర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ చేతికి రాష్ట్రం ఇస్తే ఆగమవుతుందన్నారు. కర్నాటకలో అప్పుడే కరెంట్ కష్టాలు మొదలయ్యాయని, ఆ గోస మనకు అవసరమా..? అని ప్రశ్నించారు కేటీఆర్. పెద్దపల్లికి చెందిన కాంగ్రెస్ నేతలు సత్యనారాయణరెడ్డి, రామ్మూర్తి తెలంగాణ భవన్లో మంత్రి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వీరికి కేటీఆర్..గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మరోవైపు అటు సంగారెడ్డిలో పలువురు కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్లో చేరారు. మంత్రి హరీష్రావు పార్టీ కండువా కప్పి వారిని ఆహ్వానించారు. కాంగ్రెస్-బీజేపీ మధ్య రహస్య ఒప్పందం రాజగోపాల్ చేరికతో నిజమైందని విమర్శించారు హరీష్రావు. అటు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో గులాబీ బాస్ కేసీఆర్ దూసుకుపోతున్నారు. హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా గురువారం నుంచి రెండో విడత సుడిగాలి పర్యటనలకు సిద్ధమయ్యారు. ఒక రోజులో 2 లేదా.. 3సభలకు కేసీఆర్ హాజరయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. ప్రజా ఆశీర్వాద సభల మారిన షెడ్యూల్ ప్రకారం 26న అచ్చంపేట, వనపర్తి, మునుగోడులో నిర్వహించే సభల్లో సీఎం కేసీఆర్ పాల్గొంటారు. 27వ తేదీన పాలేరు, మహబూబాబాద్, వర్థన్నపేటలో జరిగేసభలకు హాజరవుతారు. ఎన్నికల ప్రచారంలో చిన్న విరామం తర్వాత, కేసీఆర్ తన రెండవ దశ ఎన్నికల ప్రచారాన్ని అక్టోబర్ 26న అచ్చంపేట నుండి వనపర్తి, మునుగోడు నుంచి ప్రారంభించనున్నారు. తదుపరి 13 రోజులలో, తాత్కాలిక షెడ్యూల్ ప్రకారం ప్రతిరోజూ మూడు నియోజకవర్గాల చొప్పున.. 26 బహిరంగ సభలలో ఆయన ప్రసంగిస్తారు. అక్టోబరు 27న పాలేరు, మహబూబాబాద్, వర్ధన్నపేటలలో జరిగే బహిరంగ సభల్లో ఆయన పాల్గొని నవంబర్ 9న సిద్దిపేట జిల్లా కోనాయిపల్లి శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి.. గజ్వేల్, కామారెడ్డి నియోజకవర్గాల్లో నామినేషన్లు దాఖలు చేసి అనంతరం బహిరంగ సభకు హాజరుకానున్నారు. అదే రోజు కామారెడ్డిలో సమావేశం ఏర్పాటు చేశారు. BRS చీఫ్ మూడవ స్పెల్లో మిగిలిన నియోజకవర్గాలను సందర్శించనున్నారు. దీని కోసం ఈ నెలాఖరులో షెడ్యూల్ ఫిక్స్ అయ్యే అవకాశం ఉందని ఇక్కడ పార్టీ వర్గాల సమాచారం.
Admin