జై భీమ్ టీవీ - తెలంగాణ / న్యూ ఢిల్లీ : తెలంగాణ రాజకీయాలు చకచకా సాగిపోతున్నాయి. ఓ వైపు లిక్కర్ స్కామ్ రాష్ట్రాన్ని కుదిపేస్తుండగా.. మరోవైపు టీఆర్ఎస్ పార్టీ పేరును బీఆర్ఎస్ గా మార్చడం హాట్ టాపిక్ గా మారింది. ఈ మేరకు దేశ రాజధాని ఢిల్లీలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయాన్ని ఈ నెల 14 న ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇవాళ (సోమవారం) సాయంత్రం 4 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్ళనున్నారు. బీఆర్ఎస్ ఆవిర్భావం నేపథ్యంలో జాతీయ కార్యాలయ ప్రారంభోత్సవం సహా పలు కార్యక్రమాల కోసం సీఎం హస్తినకు పయనం కానున్నారు. సర్దార్ పటేల్ మార్గ్లో జాతీయ కార్యాలయాన్ని బీఆర్ఎస్ ఏర్పాటు చేస్తోంది. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంపీ జోగినపల్లి సంతోష్కుమార్లు దిల్లీకి వెళ్లి ఏర్పాట్లు పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో జాతీయ కార్యాలయ ప్రారంభోత్సవం నేపథ్యంతో పూజలు, రాజశ్యామల యాగాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించేదుకు సిద్ధమవుతున్నారు. సోమవారం రాత్రి దిల్లీకి చేరుకోనున్న ముఖ్యమంత్రి కేసీఆర్.. అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలిస్తారు. జాతీయ పార్టీల నేతలతో భేటీ కానున్నారు. రాజకీయ నేతలు, సామాజిక, ఆర్థికవేత్తలతో పాటు పలువురు ప్రముఖులతో భేటీ అవుతారని సమాచారం. పార్టీకి సంబంధించిన వివిధ కార్యక్రమాల కోసం ఆయన 17వ తేదీ వరకు దిల్లీలోనే ఉండనున్నారు. కాగా.. తెలంగాణ ఉద్యమం నుండి పుట్టిన తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్).. ఇకపై జాతీయ పార్టీగా భారతీయ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) గా ఆవిర్భవించింది. పార్టీ పేరును మారుస్తూ కేంద్ర ఎన్నికల సంఘం టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ కు ఈసీ లేఖ రాసింది. ఈ సందర్భంగా ఆ లేఖపై కేసీఆర్ సంతకం చేశారు. ఈ కార్యక్రమానికి కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి, సినీనటుడు, రాజకీయనాయకుడు ప్రకాష్ రాజ్ హాజరయ్యారు. గులాబీ జెండా మధ్యలో భారతదేశాన్ని చిత్రీకరించారు. పార్టీ జెండా రంగు, గుర్తు మాత్రం మారలేదు. 22 ఏళ్ల టీఆర్ఎస్ ను.. ఇకపై ప్రజల్లోకి బీఆర్ఎస్ గా తీసుకెళ్లే అంశంపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. తెలంగాణ నుంచి పెద్ద ఎత్తున చట్ట సభల ప్రజాప్రతినిధులు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు సైతం ఢిల్లీకి వెళ్లడానికి సిద్ధమవుతున్నారు. ఢిల్లీలో ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం దేశంలోని పలు రాష్ర్టాల్లో కూడా కార్యాలయాలను ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తోంది. పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ఢిల్లీ వీధుల్లో పెద్ద ఎత్తున హోర్డింగ్లు, ఫ్లెక్సీలు వెలిశాయి. కేసీఆర్ ఫర్ ఇండియా, దేశ్ క నేత.. కిసాన్ కీ భరోసా, అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అనే నినాదాలతో హోర్డింగ్లు, ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.
Admin