జై భీమ్ టీవీ - తెలంగాణ / హైదరబాద్ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాల లోగోను ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం (మే 22న) ఆవిష్కరించారు. ఈ లోగోను సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, హరీశ్రావుతో కలిసి సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. కాళేశ్వరం వంటి సాగునీటి ప్రాజెక్టులు, విద్యుత్తు, వ్యవసాయం, మిషన్ భగీరథ, సాంస్కృతిక, యాదాద్రి వంటి ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రాలు, మెట్రో రైలు, టీ-హబ్, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయం, 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం చిహ్నాలను ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు లోగోలో పొందుపరిచారు. తెలంగాణ తల్లి, బతుకమ్మ, బోనాలు, పాలపిట్ట, అమరవీరుల స్మారకంతో కూడిన తెలంగాణ అస్తిత్వ చిహ్నాలతో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాల లోగోను తయారు చేశారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను జూన్ 2 నుంచి 21 రోజుల పాటు ఘనంగా నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించిన విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతికుమారి ఆధ్వర్యంలో ఉత్సవాల కమిటీని ఏర్పాటు చేశారు. తెలంగాణ ఘనకీర్తి దశదిశలా చాటే విధంగా వేడుకలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో సచివాలయంలో మొదటి రోజు ఉత్సవాలు ప్రారంభమవుతాయి. అదే రోజు మంత్రులు వారి వారి జిల్లా కేంద్రాల్లో ఉత్సవాలను ప్రారంభిస్తారు. అమరవీరులను స్మరించుకునేందుకు ఒకరోజును ప్రత్యేకంగా మార్టియర్స్ డేగా జరుపుకోవాలని సీఎం తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అమరుల స్తూపాలను పుష్పాలతో, విద్యుత్ దీపాలతో అలంకరించి, గ్రామ గ్రామాన తెలంగాణ అమరవీరులను స్మరిస్తూ నివాళులర్పించాలని చెప్పారు. పిండి వంటలు, ఆటపాటలు, కవి సమ్మేళనాలు, అష్టావధానాలు, జానపదాలు, సంగీత విభావరి, సినిమా -జానపద కళాకారులతో ప్రదర్శనలు, సంగీతం, నృత్యం వంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాల లోగో ఆవిష్కరణ కార్యక్రమంలో మంత్రులు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, దేశపతి శ్రీనివాస్, పాడి కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్యేలు ఆశన్నగారి జీవన్ రెడ్డి, సీఎం ప్రధాన సలహాదారు సోమేశ్ కుమార్, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ, సీఎస్ శాంతి కుమారి, ఆర్థిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కోలేటి దామోదర్ గుప్తా పాల్గొన్నారు.
Admin