జై భీమ్ టీవీ - తెలంగాణ / : ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా తెలంగాణ కాంగ్రెస్ దూకుడు మీద ఉండడంతో వలసల జోరు కొనసాగుతుంది. బీఆర్ఎస్లో టికెట్ ఆశించి బంగపడ్డ నేతలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు హస్తం గూటికి చేరుతున్నారు. దీంతో కాంగ్రెస్లో మాంచి జోష్ కనిపిస్తుంది. ఎన్నికల వేళ కాంగ్రెస్ లో చేరికలు ఊపుందుకున్నాయి. అసంతృప్త నేతలు చాలామంది చూపు ఇప్పుడు కాంగ్రెస్వైపే ఉంది. బీఆర్ఎస్, బీజేపీ సీనియర్ నేతలు కొందరు హస్తం గూటికి చేరుతున్నారు. కాంగ్రెస్లో చేరుతున్న జాబితాలో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు ఉన్నారు. బోథ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు కాంగ్రెస్లో చేరికకు ముహుర్తం ఖరారు చేసుకున్నారు. బీఆర్ఎస్ టికెట్ ఆశించి భంగపడ్డ బాపురావు.. హస్తంతో చెలిమి చేయనున్నారు. ఇక మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యేలు ఏనుగు రవీందర్ రెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డి, చౌలపల్లి ప్రతాప్ రెడ్డిలు కూడా పీసీసీ చీఫ్ రేవంత్తో భేటీ అయ్యారు. టికెట్ హమీతో కాంగ్రెస్లో చేరేందుకు వారంతా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. జీహెచ్ఎంసీలో బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్, మాదాపూర్ కార్పోరేటర్ జగదీశ్వర్ గౌడ్ కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. శేరిలింగంపల్లి కాంగ్రెస్ టికెట్ జగదీశ్వర్ గౌడ్కు కేటాయించారనే ప్రచారం సాగుతోంది. వీరే కాకుండా పలువురు మున్సిపల్ కౌన్సిలర్లు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు పదుల సంఖ్యలో కాంగ్రెస్లో చేరారు. నల్గోండ మున్సిపాలిటి వైస్ చైర్మన్తో పాటు నలుగురు కౌన్సిలర్లు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సమక్షంలో పార్టీ కండువ కప్పుకున్నారు. దీంతో పాటు కోదాడ, హుజుర్ నగర్ నియోజకవర్గాల్లోని బీఆర్ఎస్ అపంతృప్త నేతలు, మున్సిపల్ చైర్మన్లు ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డితో టచ్లో ఉన్నారట. మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్ రావు, శశిధర్ రెడ్డి వంటి అసంతృప్త నేతల ఇళ్లకు వెళ్లి మరీ ఉత్తమ్ చర్చలు జరిపి కాంగ్రెస్లోకి ఆహ్వానించారు. ఇంకా కొంతమంది నేతలు టికెట్లు ఆశిస్తూ కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఆయా నేతలతో హస్తం నేతలు చర్చలు జరుపుతున్నారు. అన్ని కుదిరితే బీఆర్ఎస్, బీజేపీ సీనియర్లు సైతం కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకుంటారని తెలుస్తుంది. అయితే చేరబోయే నాయకుల విషయంలో హస్తం నేతలు గోప్యత పాటిస్తున్నారు. చేరికలపై క్లారిటి వచ్చేంత వరకు నేతల పేర్లను బయటకు పొక్కనీయడం లేదు. మొత్తంగా చేరికలతో కాంగ్రెస్లో జోష్ పెరుగుతోంది. అయితే కొత్తగా చేరే నేతలకు టికెట్లు ఇస్తే.. ఓట్లు పడతాయా..? ఆయా స్థానాల్లో ఎప్పట్నుంచో పార్టీని నడిపిస్తున్నవారు ఊరుకుంటారా..? అసమ్మతిని చల్లార్చేందుకు కాంగ్రెస్ ఏం చేస్తుంది అన్నది ఇప్పుడు కీలక పాయింట్.
Admin