జై భీమ్ టీవీ - తెలంగాణ / : తెలంగాణ ఎన్నికలు సమీపిస్తుండటంతో భారతీయ జనతా పార్టీ వ్యూహాలకు పదునుపెడుతోంది. ఎలాగైనా అధికారంలోకి రావలన్న సంకల్పంతో ముందుకువెళుతోంది. దీనిలో భాగంగా బీజేపీ తొలితరం నేతగా పేరున్న నల్లు ఇంద్రసేనారెడ్డిని చాలా కాలం తర్వాత పార్టీ హైకమాండ్ గుర్తించింది. గవర్నర్ హోదాకు కేంద్రానికి సిఫారసు చేయడం.. ఆపై రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయడం చకచకా జరిగిపోయాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని తుంగతుర్తి నియోజకవర్గానికి చెందిన ఇంద్రసేనారెడ్డి.. ఉమ్మడి రాష్ట్రంలో మలక్ పేట నియోజకవర్గం నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. బీజేపీ శాసనసభా పక్ష నేతగా పనిచేశారు. బీజేపీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా, పార్టీ జాతీయ కార్యదర్శిగా పనిచేశారు. ఇంద్రసేనారెడ్డి తర్వాత రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించిన దత్తాత్రేయకు కేంద్రమంత్రిగా, గవర్నర్గా ఎప్పుడో అవకాశాలు ఇచ్చిన బీజేపీ హైకమాండ్.. ఇంద్రసేనారెడ్డి విషయంలో కాస్తా ఆలస్యం చేసింది. ఇంద్రుడికి ఎన్నికల వేళ కొత్త బాధ్యతలు ఇవ్వడానికి వేరే కారణాలున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బీజేపీలో చాలా రోజులుగా బీసీ నినాదం కొనసాగుతోంది. దీంతో రెడ్డి సామాజిక వర్గం కూడా దూరం చేసుకోవద్దని బీజేపీ భావిస్తోంది. ఎప్పటికప్పుడు రెడ్డిలకు ప్రియారిటీ తగ్గకుండా బాధ్యతలు అప్పగిస్తూ వస్తోంది. కిషన్ రెడ్డికి కేంద్రమంత్రిగా, ఆ తర్వాత రాష్ట్ర అధ్యక్షుడిగా బీజేపీ అగ్రనాయకత్వం అవకాశాలు ఇస్తూ వస్తుంది. డీకే అరుణకు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా ఛాన్స్ ఇచ్చారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు అధిక స్థానాలు కేటాయిస్తే.. రెడ్డి వర్గం దూరం కాకుండా ఉండటానికి తాజాగా కాషాయ పార్టీ నాయకత్వం ఇంద్రుడిని గవర్నర్ కుర్చీలో కూర్చొబెట్టారని టాక్ వినిపిస్తోంది. మొత్తానికి ఇంద్రసేనారెడ్డికి గవర్నర్ గిరీ దక్కడం.. తెలంగాణ బీజేపీకి ఏ మేరకు లాభం జరుగుతుందో చూడాలి. ఇదిలాఉంటే.. తెలంగాణ ఎన్నికలకు దగ్గరపడుతున్న నేపథ్యంలో భారతీయ జనతాపార్టీ నాయకత్వం ఇవాళో, రేపో అభ్యర్థులను కూడా ప్రకటించనుంది. ఈ క్రమంలో ఎవరెవరికి మొదటి విడతలో సీటు లభిస్తుందనేది.. పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
Admin