జై భీమ్ టీవీ - తెలంగాణ / : తెలంగాణ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ పొలిటికల్ హీట్ పెరిగింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు హైదరాబాద్ రానున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సాయంత్రం ఎల్బీ స్టేడియంలో జరిగే బీజేపీ బహిరంగ సభలో పాల్గొంటారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత మొదటి సారి రాష్ట్రానికి వస్తుండడంతో సభను పెద్ద ఎత్తున విజయవంతం చేసే పనిలో ఉన్నారు ఆ పార్టీ నేతలు. ప్రధానితో పాటు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కూడా ఈ సభలో పాల్గొంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఎన్నికల ప్రచారం ముమ్మరం చేసింది. అభ్యర్ధు ఖరారు దాదాపు పూర్తి కావడంతో ఇప్పుడు ప్రచారంపై దృష్టి సారించింది. బీజేపీ ప్రచారంలో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎల్బీ స్టేడియంలో నిర్వహించే బీసీ ఆత్మగౌరవ సభలో పాల్గొంటారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో సాయంత్రం ఐదున్నర గంటలకు ప్రధాని బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా ఎల్బీ స్టేడియం వెళ్లి బహిరంగ సభకు హాజరవుతారు. సభ ముగిసిన తర్వాత తిరిగి ఢిల్లీ వెళ్లిపోతారు. సభకు లక్ష మందిని తరలించేందుకు పార్టీ నేతలు కృషి చేస్తున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పార్టీ నాయకులు సునీల్ బన్సల్, ఇతర నేతలు ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. తెలంగాణలో బీసీ నినాదాన్ని ఎత్తుకున్న బీజేపీ ఇప్పటికే తాము అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తామని ప్రకటించింది. దీంతో ఆ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం వచ్చింది. బీసీ సీఎం అంశాన్ని ప్రచారాస్త్రంగా వాడుకుంటుంది. ఇప్పుడు బీసీ ఆత్మ గౌరవ సభలో ప్రధాని ఏం హామీలు ఇస్తారోననేది రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. రాష్ట్రంలో సగానికి పైగా ఉన్న బీసీలకు ఏ పార్టీ సరైన గౌరవం ఇవ్వలేదని విమర్శిస్తున్నారు బీజేపీ నేతలు. బీజేపీ అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రిని చేస్తామంటూ బీసీల ఓట్లను ఆకర్శించే ప్రయత్నం చేస్తోంది. బీసీని ముఖ్యమంత్రిని చేసుకునే అవకాశం బీసీలపైనే ఉందంటున్నారు పార్టీ నేతలు. ఎల్బీ స్టేడియంలో ప్రధాన మంత్రి బహిరంగ సభ ఉండడంతో హైదరాబాద్ మహానగరంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు నిర్వహించారు. ముఖ్యంగా బషీర్ బాగ్ నుంచి, ఏఆర్ పెట్రోల్ పంపు నుంచి, గన్ ఫౌండ్రీ నుంచి ఎల్బీ స్టేడియం వైపు వెళ్లే వాహనాలను దారి మళ్లించారు. సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి.
Admin