జై భీమ్ టీవీ - తెలంగాణ / : తెలంగాణలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో అధికార పార్టీ బీఆర్ఎస్ స్పీడు పెంచింది. భారత రాష్ట్ర సమితి అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఇప్పటికే అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. దీంతో ఎమ్మెల్యే అభ్యర్థులు వరుసగా సమావేశాలు నిర్వహిస్తూ.. తమదైన శైలిలో దూసుకెళ్తున్నారు. అభివృద్ధి కార్యక్రమాలతోపాటు.. పార్టీ కార్యక్రమాలు, ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు. తాజాగా.. బీఆర్ఎస్ స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గ అభ్యర్థి కడియం శ్రీహరి.. పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో హాట్ కామెంట్స్ చేశారు. సంక్షేమ పథకాల కోసం ఎవరికి లంచాలు ఇవ్వొద్దంటూ ప్రజలకు సూచించారు. ఎవరైనా రూపాయి అడిగినా చెప్పండి, బట్టలు ఊడదీయిస్తానంటూ కడియం ఘాటుగా వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యే రాజయ్య, పల్లా రాజేశ్వర్ రెడ్డి సహకారంతో స్టేషన్ ఘన్పూర్ అభివృద్ధి కోసం కృషి చేస్తానని పేర్కొన్నారు. తెలంగాణలో స్టేషన్ ఘన్పూర్ను నెం.1గా మార్చుతానంటూ ఈ సందర్భంగా కడియం శ్రీహరి కార్యకర్తలకు హామీనిచ్చారు. హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం పెద్దపెండ్యాలలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో కడియం శ్రీహరి ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి.. కాంగ్రెస్ పార్టీపై కూడా విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ అంటే అవినీతి, అక్రమాలు చేయడమేనన్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలకు దోచుకోవడం, దాచుకోవడమే తెలుసని.. జాతీయ పార్టీకి ఒక్క జాతీయ విధానం కూడా లేదంటూ కడియం పేర్కొ్నారు. తెలంగాణ తరహా పథకాలు కర్ణాటకతోపాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు లేవంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్కే గ్యారంటీ లేదు, వారిచ్చే హామీలకు గ్యారంటీ ఉంటుందా? అంటూ కడియం ఫైర్ అయ్యారు. ఎవ్వరి మాటలు నమ్మవద్దని.. సీఎం కేసీఆర్ తెలంగాణను అభివృద్ధి పథంలో తీర్చిదిద్దుతున్నారంటూ పేర్కొన్నారు. నియోజకవర్గంలో కష్టమైన పరిస్థితులు.. రాజయ్య ఆవేదన.. ఇదిలాఉంటే.. స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేశవనగర్ గ్రామ పంచాయతీ భవనం ప్రారంభోత్సవంలో మాట్లాడిన ఎమ్మెల్యే.. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు చూస్తే నేను నియోజకవర్గానికి రావాల్సిన అవకాశం లేదంటూ పేర్కొన్నారు. నియోజకవర్గంలో కష్టమైన పరిస్థితులు నడుస్తున్నాయని.. డప్పు కొట్టాలన్నా, ఫ్లెక్సీలు కట్టాలన్నా భయపడుతున్నారన్నారు. కోలాటమాడాలన్నా భయపడుతున్నారు.. ఎందుకు అభద్రత భావంలో ఉన్నారో అర్దం కావట్లేదన్నారు. ప్రస్తుతం తానే ఎమ్మెల్యేనని..అయినా ఇలాంటి పరిస్థితి ఉందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, స్టేషన్ ఘన్పూర్ టికెట్ దక్కకపోవడంతో తాటికొండ రాజయ్య గత కొంత కాలం నుంచి అసంతృప్తితో ఉన్నారు. అధిష్టానం బుజ్జగించినా.. ఆయన పలు సందర్భాల్లో చేస్తున్న వ్యాఖ్యలు పార్టీలో చర్చనీయాంశంగా మారాయి.
Admin