జై భీమ్ టీవీ - తెలంగాణ / : హైదరాబాద్: కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుందని తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. దాంతో పాటు తెలంగాణలోనూ అధికారంలోకి వస్తామని చెప్పారు. బుధవారం కర్నాటకలోని అలంద్, చించోలిలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన పాల్గొన్నారు. ఏఐసీసీ చీఫ్ ఖర్గే నాయకత్వంలో హిమాచల్ప్రదేశ్ ఎన్నికల్లో గెలిచామని, ఇప్పుడు కర్నాటకలో 150 సీట్లు గెలుస్తామన్నారు. ఏ అవసరమొచ్చినా కొడంగల్కు రావొచ్చని, అక్కడ కుదరకపోతే హైదరాబాద్కైనా రావొచ్చని ఆయా నియోజకవర్గాల ప్రజలకు సూచించారు. కర్నాటకలో 40 శాతం కమీషన్ సర్కారును బొంద పెట్టాలని పిలుపునిచ్చారు. ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా చెప్పినట్టు కర్నాటకలో అభివృద్ధి జరిగే ఉంటే.. వాళ్లొచ్చి ప్రచారం చేయడమెందుకని రేవంత్ ప్రశ్నించారు. ఏ హామీలనూ నెరవేర్చకుండా ఏ మొహం పెట్టుకొని వాళ్లు ప్రచారం చేస్తారని ప్రశ్నించారు. కర్నాటక బిడ్డ మల్లికార్జున ఖర్గేని బీజేపీ కుట్ర చేసి ఓడించిందని ఆరోపించారు. కానీ, కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆయనకు ఏఐసీసీ అధ్యక్ష పదవినిచ్చి గౌరవించిందన్నారు. మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్, ఇందిరాగాంధీ వంటి వారు అధిష్ఠించిన ఏఐసీసీ చీఫ్ పదవిలో ఆయన్ను కూర్చోబెట్టిందన్నారు. కర్నాటక భూమి పుత్రుడైన ఖర్గే వెంట కన్నడ ప్రజలంతా నడవాల్సిన అవసరం ఉందన్నారు.
Admin