జై భీమ్ టీవీ - తెలంగాణ / : తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు కొన్ని రోజుల నుంచి జ్వరంతో బాధపడుతున్న విషయం తెలిసిందే.. వైద్యుల పర్యవేక్షణలో ఆయన చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. జ్వరంతో బాధపడుతున్న సీఎం కేసీఆర్ పూర్తిగా కోలుకున్నారని.. రేపో మాపో పూర్తిగా జనంలోకి రాబోతున్నారని మంత్రి కేటీఆర్ తెలిపారు. కేసీఆర్ ఆరోగ్యం బాగాలేదని కొందరు ప్రజలు ఆందోళన చెందుతున్నారని.. ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. ఆయన బయటికి వస్తే ఈ గుంట నక్కలు – తోడేళ్లని తోక ముడుచుకొని తొర్రలోకి వెళ్లాల్సిందేనంటూ ప్రతిపక్ష పార్టీలపై ఫైర్ అయ్యారు. సోమవారం వరంగల్ ఉమ్మడి జిల్లాలో పర్యటించిన కేటీఆర్ .. భూపాలపల్లి, పరకాల, తొర్రూరులో ప్రాంతాల్లో నిర్వహించిన బహిరంగ సభల్లో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, బీజేపీ పార్టీలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దేశాన్ని నాశనం చేసిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మళ్లీ ఒక్క ఛాన్స్ అని ప్రజల్లోకి వస్తుందని కొత్తగా ఏం వొరగ పెడతారంటూ ప్రశ్నించారు.. మళ్లీ కొత్త నాటకాలతో ప్రజల వద్దకు వస్తున్న వారిని నిలదీయాలంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. బీజేపీ, కాంగ్రెస్ రెండు పార్టీల నేతలు ఇప్పటికే జనం మధ్యకు వస్తున్నారని, జాతీయ నేతలు కూడా బహిరంగ సభలతో హడావుడి చేస్తున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ సమయంలో ప్రజలు కేసీఆర్ ఏం చెప్తారోనని ఉత్కంఠతగా ఎదురుచూస్తున్నారని అన్నారు. కేసీఆర్ జ్వరం నుండి పూర్తిగా కోలుకున్నారని రేపు మాపో జనం మధ్యకు రాబోతున్నారని తెలిపారు. కాంగ్రెస్- బీజేపీ నాయకులు డబ్బులు, డాలర్లు ఎన్ని ఇచ్చినా తీసుకోండి.. ఓటు మాత్రం బీఆర్ఎస్ కే వేయాలంటూ కోరారు. పులి బయటకు వస్తే.. ఇప్పుడు హడావుడి చేస్తున్న ఈ గుంటనక్కలు, తోడేళ్లన్ని తోక ముడుచుకోవాల్సిందే అంటూ కేటీఆర్ పేర్కొన్నారు.. బీఆర్ఎస్ పార్టీ మూడవసారి అధికారంలోకి రావడంపై ధీమా వ్యక్తం చేశారు. BRS అభ్యర్థులను మరోసారి ఆశీర్వదించి అసెంబ్లీకి పంపాలని కోరారు.
Admin