జై భీమ్ టీవీ - తెలంగాణ / : తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల నోటిఫకేషన్కు రోజులు సమీపస్తుండటంతో పొలిటికల్ పార్టీలు తమకు పట్టున్న ప్రాంతాలపై దృష్టి సారిస్తున్నాయి. ఓటు బ్యాంక్ ఉన్న చోట్ల జాతీయ నాయకుల పర్యటనలు ఖరారు చేసే పనిలో రాష్ట్ర నాయకత్వం తలమునకలైంది. ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ప్రధాన పార్టీల ఫోకస్ ఎక్కువైంది. ఉమ్మడి పాలమూరులో పాగా వేసేందుకు ప్రధాన పార్టీలు వ్యూహరచనలు చేస్తున్నాయి. జిల్లాలో అధికార బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీకి మంచి పట్టు ఉండడంతో పార్టీ నాయకత్వాలు దృష్టి సారించాయి. వీలైనన్ని ఎక్కువ సీట్లు గెలిచేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. పాలమూరు జిల్లాలో ప్రధాన పార్టీల నేతలు బలంగా కనిపిస్తున్న నేపథ్యంలో పార్టీలు అందుకు తగ్గట్లు ప్రచారానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్లు ముఖ్య నాయకుల సభలకు ప్లాన్ చేస్తున్నాయి. ఇప్పటికే కమలం పార్టీ ఒక అడుగు ముందుకేసి ఎన్నికల షెడ్యూల్ కంటే ముందే ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభను విజయవంతంగా నిర్వహించింది. రానున్న రోజుల్లో పార్టీ జాతీయ నాయకులు, ఇతర రాష్ట్రాల ముఖ్యంత్రులతో సమావేశాలు, ర్యాలీలకు ప్లాన్ చేస్తున్నారు బీజేపీ నేతలు. ముఖ్యంగా కల్వకుర్తి, నారాయణపేట, మక్తల్, గద్వాల్ మహబూబ్ నగర్ నియోజకవర్గాలపై బీజేపీ ఫోకస్ చేసినట్లుగా తెలుస్తోంది. అందుకు తగ్గట్టుగానే నేతల ప్రచారాల ప్రణాళికలు సిద్ధమవుతున్నాయని టాక్ నడుస్తోంది. ఇక కాంగ్రెస్ సైతం పాలమూరుపై గంపెడు ఆశలు పెట్టుకుంది. కీలక నేతలు జూపల్లి కృష్ణారావు, కసిరెడ్డి నారాయణరెడ్డి, సరితా తిరుపతయ్య మరికొంత మంది పార్టీల చేరడంతో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. కొడంగల్, కొల్లాపూర్, కల్వకుర్తి, అచ్చంపేట, గద్వాల్, అలంపూర్, మహబూబ్ నగర్, మక్తల్, నారాయణపేట, వనపర్తి నియోజకవర్గాల్లో దృష్టి సారించింది కాంగ్రెస్. అందుకు తగ్గట్టుగానే గాంధీ కుటుంబసభ్యులతో ప్రచారానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటీవలే కాంగ్రెస్ లో కీలక నేతలు చేరిన ప్రాంతాల్లో ప్రచారాన్ని బలంగా నిర్వహించే యోచనలో హస్తం నాయకత్వం ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అక్టోబర్ 31న కొల్లాపూర్ లో కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ ముఖ్య అతిథిగా పాలమూరు ప్రజాభేరి సభ నిర్వహించ తలపెట్టారు. అలాగే రెండో విడత బస్సు యాత్రలో ఉమ్మడి జిల్లాలో పలు నియోజకర్గాలను కవర్ చేసేలా ప్లాన్ చేశారు. అధికార పార్టీ సైతం మహబూబ్ నగర్ ప్రచార హోరుకు ముందే సిద్ధమయ్యింది. పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్ను ప్రారంభించడంతో ఒక రకంగా ముందే ఎన్నికల వేడి రాజేసింది బీఅర్ఎస్. గులాబీ బాస్ ఇప్పటికే జడ్చర్ల సభలో పాల్గొని కార్యకర్తలను సన్నద్ధం చేశారు. ఇవాళ అచ్చంపేట, వనపర్తి నియోజకవర్గాలలో ప్రజా ఆశీర్వాద సభలు నిర్వహిస్తున్నారు. ఇక రానున్న రోజుల్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావుతో సైతం ర్యాలీలు, సభలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మూడు పార్టీలు మహబూబ్ నగర్ జిల్లాలో ప్రచార పర్వానికి సన్నద్ధం అవుతున్నాయి. జాతీయ స్థాయి నేతలతో ప్రచారం ఆయా పార్టీలకు ఏ మేర కలిసి వస్తయో వేచి చూడాల్సిందే మరీ.
Admin