జై భీమ్ టీవీ - తెలంగాణ / హైదరబాద్ : తెలంగాణ పరిపాలనకు గుండెకాయగా, అత్యంత శోభాయమానంగా నిర్మించిన సచివాలయం తన చేతుల మీదుగా ప్రారంభించడం తన జీవితంలో దొరికిన గొప్ప అదృష్టంగా భావిస్తున్నాని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. సచివాలయ నిర్మాణంలో అందరి కృషి ఉందని వెల్లడించారు. సచివాలయ తరహాలోనే తెలంగాణ పల్లెలు కూడా వెలిగిపోతున్నాయని చెప్పారు. హైదరాబాద్లో నూతన నిర్మించిన సెక్రటేరియట్ ప్రారంభోత్సవం అనంతరం ఏర్పాటు చేసిన సభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. పెద్ద పోరాటం తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. సమైక్య పాలనలో తెలంగాణలో చాలా విధ్వంసం జరిగిందన్నారు. వ్యవసాయానికి నీళ్లు వచ్చేవి కాదన్నారు. ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియాలో కూడా హైదరాబాద్ మినహా అన్ని జిల్లాలను వెనుకబడిన జిల్లాల్లో చేర్చారని అన్నారు. ఈ రోజు తెలంగాణ సాధించిన ప్రగతిలో ప్రతి ఒక్కరి కృషి ఇమిడి ఉందని, అనేక విభాగాలు కలిసి పని చేయడం వల్లే ప్రగతి సాధ్యమైందని చెప్పారు. సమాన హక్కుల కోసం ఉద్యమించాలని, సమీకరించు, బోధించు పోరాడు అని సందేశం ఇచ్చిన మహానీయుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని, వారి సందేశంతోనే గాంధీజీ మార్గంలో శాంతియుత పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్నామని కేసీఆర్ చెప్పారు. అంబేద్కర్ చూపిన మార్గంలోనే మన ప్రయాణం కొనసాగుతుందన్నారు. ఆ మహనీయుడు రాసిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారమే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని చెప్పారు. అన్ని వర్గాల ప్రజల ముఖంలో చిరునవ్వులు రావాలన్న అంబేద్కర్ స్ఫూర్తిని అందుకుని 125 అడుగుల ఎత్తులో అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్టించుకున్నామన్నారు. అనునిత్యం అంబేద్కర్ స్ఫురణకు రావాలనే ఉద్దేశంతో సచివాలయానికి ఆ మహానీయుడి పేరు పెట్టుకున్నామని, ఆయన అడుగుజాడల్లోనే నడుస్తామని హామీ ఇస్తున్నామని సీఎం కేసీఆర్ తెలిపారు. మరోవైపు.. ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో సీఎం కేసీఆర్ మండిపడ్డారు. పునర్నిర్మాణం కోసం అంకితభావంతో అడుగేసే సమయంలో తెలంగాణ భావాన్ని, నిర్మాణాన్ని కాంక్షను జీర్ణించుకోలేని కొందరు పిచ్చివారు కారుకూతలు కూశారని వ్యాఖ్యానించారు. మొత్తం తెలంగాణనే కూలగొట్టి కడుతారా..? అని చిల్లర వ్యాఖ్యలు చేశారని, అవేమీ పట్టించుకోకుండా పునర్నిర్మాణం చేసుకున్నామన్నారు. ‘‘పునర్నిర్మాణం అంటే వచ్చిన నీటిని, కోల్పోయిన చెరువులను పునర్నిర్మాణం చేసుకున్నాం. జీవనదులు, ఉపనదులు తెలంగాణలో ఉన్నాయి. గోదావరి నది ఎప్పుడు దాటినా అక్కడ చిల్లర డబ్బులు వేసి దండం పెట్టేవాడిని. మా పొలాలు ఎప్పుడు పండిస్తావని అడిగేవాడిని. తెలంగాణ ఇంజినీర్లు చేసిన అద్భుతమైన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు ఉన్నాయి. ఇది పునర్నిర్మాణం అంటే’’ అని వ్యాఖ్యానించారు.
Admin