జై భీమ్ టీవీ - తెలంగాణ / : చంపాపేట్ స్వప్న మర్డర్ కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు. స్వప్న, హన్మంతులది హత్యా..? ఆత్మహత్యనా? లేక సుఫారి ఇచ్చి చంపించారా? పోలీసులకు చిక్కిన సీసీ ఫుటేజీలో ఉన్న ఆ ఇద్దరు ఎవరు..? అనేది ఇప్పడు హాట్ టాపిక్గా మారింది. హైదరాబాద్లోని చంపాపేట రాజీరెడ్డి నగర్లో నివాసం ఉంటున్న స్వప్న, ఆమె భర్త హన్మంతుల మర్డర్ కేసు కీలక మలుపు తిరుగుతోంది. నెల రోజుల క్రితమే మహబూబ్ నగర్ కు చెందిన స్వప్న కు, హన్మంతుకు ప్రేమ వివాహం జరిగింది. ప్రేమ వివాహం జరిగినప్పటి నుంచి స్వప్న కుటుంబానికి దూరంగా ఉంటోంది. స్వప్న, హన్మంతులతో పాటు ఆమె అన్నయ్య కూడా అదే ఇంట్లో నివాసం ఉంటున్నాడు. అయితే మర్డర్ జరగడానికి రెండ్రోజుల ముందు నుంచి అతను ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోయాడు. ఈలోపు ఏం జరిగిందో తెలియదు కానీ.. స్వప్న రక్తపు మడుగులోపడి మరణించడం అందర్నీ తీవ్రంగా కలిచివేసింది. హన్మంతు పై నుంచి కిందపడగా.. ప్రస్తుతం చావుబతుకల మధ్య ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. స్వప్న గదిలోనే మరణించి ఉన్నట్లు ఇంటి యాజమాని తెలిపారు. మొదట స్వప్నను హత్య చేసి..ఆ తర్వాత హన్మంతు కిందకి దూకి ఆత్మహత్యాయత్నం చేసుకుని ఉండవచ్చని పోలీసులు అనుమానించారు. తీరా..స్థానికులను విచారించిన పోలీసులు పక్కనే ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు. స్వప్న హత్య సమయంలో ఇంట్లో ఇద్దరు వ్యక్తులు ఉన్నట్టు పోలీసులు భావిస్తున్నారు. స్వప్న హత్యానంతరం హన్మంతును కిందకు పడేసినట్టు అనుమానిస్తున్నారు. నిందితులు పారిపోతున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. స్వప్న, హన్మంతులది ఆత్మహత్య అనుకున్న పోలీసులు.. ఇది సుపారీ హత్యనా..? లేక వివాహేతర సంబంధమా..? అనే కోణంలో దర్యాప్తును వేగవంతం చేశారు. సీసీ కెమెరాలో ఉన్న ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరని ఆరా తీస్తున్నారు. ఇందుకోసం స్వప్న కాల్డేటాను పరిశీలిస్తున్నారు. ప్రేమ వివాహం ఇష్టంలేని స్వప్న వైపు బంధువులే ఈ దారుణానికి ఒడిగట్టారా..? అసలు ఏం జరిగిందనే దానిపై ఆరా తీసేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. ఈ క్రమంలోనే స్వప్నకు వేరే అబ్బాయితో పరిచయం ఉందని తెలియడంతో ఆ కోణంలో కూడా దర్యాప్తును ప్రారంభించారు. హత్యకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని పోలీసులు పేర్కొన్నారు. పోస్టుమార్టం నిమిత్తం స్వప్న మృతి దేహాలను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
Admin