జై భీమ్ టీవీ - తెలంగాణ / : కాంగ్రెస్తో కమ్యూనిస్టుల పొత్తు ఎట్టకేలకు కన్ఫామ్ అయింది. అధికారిక ప్రకటన ఇంకా రాకపోయినా సిపిఐ, సిపిఎంలకు చెరో రెండు స్థానాలు ఇస్తామని కాంగ్రెస్ తేల్చి చెప్పడంతో వాటికి లెఫ్ట్ పార్టీలు సైతం మౌఖికంగా సరే అన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ రెండో జాబితా ప్రకటనకు ముందే వామపక్షాలతో పొత్తుపై అధికారిక ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణ ఎన్నికల్లో వామపక్షాలు కాంగ్రెస్తో కలిసి బరిలో దిగేందుకు అంత సిద్ధమైంది. ఇప్పటికే 55 మందితో తొలి జాబితా విడుదల చేసిన కాంగ్రెస్ రెండో జాబితా కోసం కసరత్తు చేస్తూనే వామపక్షాలకు కేటాయించాల్సిన సీట్లను కన్ఫామ్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో లెఫ్ట్ పార్టీలతో పొత్తు దాదాపు ఖరారు అయిందని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ వెల్లడించారు. సిపిఐ, సిపిఎం చేరో అయిదు స్థానాలు కాంగ్రెస్ను కోరగా.. చెరో రెండు స్థానాలు ఇచ్చేందుకు హస్తం నేతలు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. సిపిఐకి కొత్తగూడెం, చెన్నూరు కేటాయించగా.. సిపిఎంకు మిర్యాలగూడతో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వైరా సీటును ఇచ్చేందుకు సరే అన్నట్లు సమాచారం. ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి రాజకీయ అవగాహన కుదిరినా.. సీట్ల అంశం తేలలేదంటూ అటు కాంగ్రెస్ ఇటు వామపక్ష నేతలు చెప్పుకుంటూ వచ్చారు. ప్రస్తుతం అది కూడా కొలిక్కి రావడంతోటి ఇక అధికారిక ప్రకటన తరువాయి అంటున్నారు నేతలు. వామపక్షాలు ఉమ్మడి ఖమ్మం, నల్గొండ జిల్లాలోనే ప్రాబల్యం చూపే అవకాశం ఉన్న నేపథ్యంలో అక్కడి నుంచే సీట్లు ఇవ్వాలని పట్టు పట్టడం.. ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ హౌస్ఫుల్ కావడంతో సీట్ల పంచాయతీ ఇంతకాలం సాగుతూ వచ్చింది. సిపిఐ, సిపిఎం కోరిన స్థానాల్లో ఒక సీటు వాళ్ళు అడిగినది మరొక సీటు కాంగ్రెస్ అనుకున్నది ఇచ్చేందుకు అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఆ మేరకే సిపిఐ అడిగినదాంట్లో కొత్తగూడెం దానికి తోడుగా చెన్నూరు ఇచ్చేందుకు కాంగ్రెస్ ముగ్గు చూపింది. సిపిఎంకి సంబంధించి మిర్యాలగూడతో పాటు పాలేరు కావాలని పట్టుబట్టగా పాలేరు ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పి ఖమ్మం జిల్లాలోనే వైరా సీటును కేటాయిస్తామని స్పష్టం చేసింది. ఈ ప్రతిపాదనలకు వామ పక్షాలు సైతం మౌఖికంగా సరే అన్నాయి. మునుగోడు సీటు తమకు కేటాయించాల్సిందేనని సిపిఐ నల్గొండ నేతలు పట్టుబట్టారు. మునుగోడు లేకుండా పొత్తు ప్రస్తావనే వద్దన్న నేతల వ్యాఖ్యలు ఇప్పుడు హార్ట్ టాపిక్ గా మారాయి. అయితే మునుగోడుపై భేదాభిప్రాయాలు ఉన్న మాట వాస్తవమేనని అధిష్టాన నిర్ణయానికి ఫైనల్ గా నేతలంతా కట్టుబడి ఉండాల్సిందని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. మునుగోడు కాంగ్రెస్ సీటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఇస్తామంటేనే ఆయన పార్టీలో చేరుతున్నట్లు సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలో మునుగోడులో కాంగ్రెస్సే బరిలో ఉంటుందని సిపిఐకి గతంలో కేటాయించిన సీట్లనే ఓకే చేసినట్లు తెలుస్తోంది. సిపిఐకి కేటాయించిన సీట్లలో కొత్తగూడెం నుంచి కూనంనేని సాంబశివరావు, చెన్నూరు నుంచి చంద్రశేఖర్ బరిలోకి దిగనున్నట్లు తెలుస్తుంది. మరోవైపు సిపిఎం తరపున మిర్యాలగూడ నుంచి జూలకంటి రంగారెడ్డి, వైరా నుంచి భూక్య వీరభద్రం పోటీలో ఉండనున్నారు. పొత్తుపై అధికారిక ప్రకటన వచ్చిన తర్వాత.. ఈ నలుగురు అభ్యర్థులను సైతం లెఫ్ట్ పార్టీలు ప్రకటించనున్నాయి. పొత్తు కుదిరాక రెబల్స్ పోటీలో దిగకుండా చూడాల్సిన బాధ్యత ఆయా పార్టీలదేనని నేతలు అంటున్నారు. మునుగోడులో స్నేహపూర్వక పోటీకి నల్గొండ సీపీఐ నేతలు సై అంటుండటంతో అక్కడ పోటీ లేకుండా సంపూర్ణ మద్దతు ఇచ్చేలా చూడాలని కాంగ్రెస్, సీపీఐని కోరుతుంది.
Admin