జై భీమ్ టీవీ - తెలంగాణ / : తెలంగాణలో ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ఇది ప్రచారంలో పాల్గొనే రాజకీయ నాయకులకే కాదు. ఎన్నికల విధులు నిర్వహిస్తున్న అధికారులకు కూడా వర్తిస్తుంది. ప్రస్తుతం అడ్మినిస్ట్రేషన్ మొత్తం ఎన్నికల సంఘం అధికారుల చేతిలో ఉంటుంది. వారి ఆదేశాను సారం ప్రతి డిపార్ట్మెంట్ తమ విధులను నిర్వర్తించాలి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి అధికారి ఈసీ ఆదేశాలకు లోబడి నడుచుకోవల్సి ఉంటుంది. అయితే ఇలా తమ విధుల్లో ఎన్నికల కోడ్ను ఉల్లంఘించారంటూ ఇద్దరు అధికారులపై సస్పెన్షన్ వేటు వేసింది ఈసీ. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని (మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్) ఉల్లంఘించినందుకు తెలంగాణ రాష్ట్ర పర్యాటకాభివృద్ది సంస్థ ఎండీ మనోహర్ రావు, ఆయన ఓఎస్డీగా విధులు నిర్వర్తిస్తున్న రిటైర్డ్ ఆఫీసర్ సత్యనారాయణను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఎన్నికల కమిషన్. మహబూబ్నగర్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి బరిలో దిగిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ గత నెల 15,16 తేదీల్లో తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లారు. ఈ ఇద్దరు అధికారులు ఆయనతో పాటూ తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వెళ్లడం రాజకీయంగా కొంత చర్చ జరిగింది. దీంతో కొందరు నాయకులు ఈ ఇద్దరు అధికారులపై రాష్ట్ర సీఈవోకి ఫిర్యాదులు చేశారు. ఈ ఫిర్యాదుల ఆధారంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక పంపింది. దీనిపై స్పందించిన ఈసీ ఆ ఇద్దరు అధికారులను ప్రస్తుతం సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వారిద్దరిపై శాఖా పరమైన చర్యలు తీసుకోవాలని పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శిని ఈసీ ఆదేశించింది. దీంతో ఈ ఇద్దరు అధికారులకు పర్యాటక శాఖ నోటీసులు పంపింది. తిరుమల వ్యవహారంపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో ఒక నివేదిక రూపంలో తమకు ఈనెల 19వ తేదీ మధ్యాహ్నం మూడు గంటల్లోగా పంపాలని గడువు ఇస్తూ నోటీసుల్లో పేర్కొంది.
Admin