జై భీమ్ టీవీ - తెలంగాణ / : ఒకప్పుడు కంచుకోటగా ఉన్న ఆ నియోజక వర్గాన్ని తిరిగి చేజిక్కించుకోవాలని ఆ పార్టీ తెగ ప్రయత్నించింది. కానీ రాష్ట్రస్థాయిలో వామపక్షాల పొత్తు.. ఇక్కడ పార్టీలో చిచ్చు రాజేసింది. ఈ స్థానాన్ని సీపీఎంకు ఇవ్వాలని కాంగ్రెస్ సూత్రప్రాయంగా నిర్ణయించడంతో.. మిర్యాలగూడ కాంగ్రెస్లో ముసలం మొదలైంది. దీంతో నియోజక వర్గంలో సేవ్ కాంగ్రెస్, సేవ్ మిర్యాలగూడ పేరుతో ఆశావాహులు ఆందోళనల బాట పట్టారు. దీంతో కాంగ్రెస్ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజక వర్గం ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి అనుచరుడు నల్లమోతు భాస్కర్ రావు 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ నుండి గెలుపొంది బీఆర్స్లో చేరారు. దీంతో అప్పటి నుంచి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బలహీన పడింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ నేత ఆర్.కృష్ణయ్యను బరిలో దింపినా కాంగ్రెస్ కు ఓటమి తప్పలేదు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే ఆశావాహుల నుంచి పీసీసీ దరఖాస్తులను ఆహ్వానించింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో అత్యధికంగా 18 దరఖాస్తులు మిర్యాలగూడ నియోజకవర్గం నుంచే వచ్చాయి. ఇక్కడ ప్రధానంగా సీనియర్ నేత జానారెడ్డి తనయుడు రఘువీర్ రెడ్డి, మున్సిపల్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ గా ఉన్న బత్తుల లక్ష్మారెడ్డి టికెట్ కోసం పోటీ పడుతున్నారు. గత మున్సిపల్ ఎన్నికలకు ముందు అప్పటి పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, బీఎల్ఆర్ను పార్టీలోకి ఆహ్వానించారు. బీఎల్ఆర్ రాకతో మిర్యాలగూడ మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు గట్టిపోటీ ఇచ్చింది. ఇద్దరు ఎంపీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిల అండదండలు ఉండడంతో తక్కువ కాలంలోనే బలమైన నేతగా బీఎల్ఆర్ ఎదిగారు. . ఈ నేపథ్యంలోనే వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా మిర్యాలగూడను చేజిక్కించుకోవాలని చూస్తున్న కాంగ్రెస్కు కామ్రేడ్ల పొత్తు చిచ్చు పెట్టింది. పొత్తులలో భాగంగా సీపీఎం, సీపీఐలు ప్రధానంగా నల్లగొండ జిల్లాలోని మిర్యాలగూడ, మునుగోడు స్థానాలను అడుగుతున్నాయి. మిర్యాలగూడలో సీపీఎం తరపున మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి పోటీకి దిగాలని భావిస్తున్నారు. ఇక్కడి నుంచి జూలకంటి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలవడం, అలాగే సిమెంట్, రైస్ ఇండస్ట్రీస్ ఎక్కువగా ఉండటంతో ఆ కార్మికుల ఓట్లు కలిసొస్తాయని సీపీఎం భావిస్తోంది. మరోవైపు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ మొదటి అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. వామపక్షాల పొత్తులో భాగంగా సీపీఎంకు ఈ సీటును కేటాయించే అంశంపై జాతీయ నాయకుల మధ్య చర్చలు జరిగుతున్నాయి. ఉదయ్పూర్ డిక్లరేషన్ మేరకు ఒకే కుటుంబానికి రెండు టికెట్ ఇవ్వడం కుదరకపోవడంతో నాగర్జున సాగర్ నుంచి జానారెడ్డి తనయుడు జై వీర్ రెడ్డికి మాత్రమే కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది. ఇక్కడ బిఎల్ఆర్కు చెక్ పెట్టేందుకే జానారెడ్డి ఈ స్థానాన్ని సీపీఎంకు ఇచ్చేందుకు కూడా ఆయన సుముఖంగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది కాంగ్రెస్ కు గెలుపు అవకాశాలు ఉన్నందున తమకే టికెట్ కేటాయించాలన్నది కాంగ్రెస్ వర్గాల డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సేవ్ కాంగ్రెస్, సేవ్ మిర్యాలగూడ పేరుతో దామరచర్ల మండలం రాళ్లవాగు తండా నుంచి మిర్యాలగూడ వరకు బీఎల్ఆర్ భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో భారీగా కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నాయి. మిర్యాలగూడ నియోజకవర్గంలో కార్యకర్తలలో నెలకొన్న ప్రలోభలను తొలగించేందుకే ఈ ర్యాలీ నిర్వహించామని బిఎల్ఆర్ చెప్పుకొచ్చారు. మిర్యాలగూడలో కాంగ్రెస్ బలంగా ఉందని, వచ్చే ఎన్నికల్లో భారీ మెజార్టీతో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని, మిర్యాలగూడ టికెట్ ను కాంగ్రెస్ కేటాయించాలని నేతలు డిమాండ్ చేస్తున్నారు. కొన్ని రోజుల నుంచి సిపిఎం పార్టీకి టికెట్ కేటాయిస్తున్నారని జరుగుతున్న ప్రచారాన్ని అపోహలను తొలగించాలని కాంగ్రెస్ అధిష్టానాన్ని డిమాండ్ చేశారు. ఇక గత ఎన్నికల్లో సీపీఎం పార్టీకి కేవలం 11,000 ఓట్లు మాత్రమే వచ్చాయని కాంగ్రెస్ నేతల వాదన. కాంగ్రెస్ పార్టీకి కాకుండా సీపీఎంకు ఈ స్థానాన్ని కేటాయిస్తే వచ్చే ఎన్నికల్లో పనిచేసే ప్రసక్తే లేదని తేల్చి చెబుతున్నారు కాంగ్రెస్ నేతలు. అవసరమైతే పార్టీ మార్పుపై కూడా ఆలోచిస్తామంటున్నారు నేతలు. మొత్తానికి మిర్యాలగూడ కాంగ్రెస్ లో పొత్తుల చిచ్చు ఎటు దారితీస్తుందోనని క్యాడర్ ఆందోళన చెందుతోంది.
Admin