జై భీమ్ టీవీ - తెలంగాణ / వరంగల్ జిల్లా : గ్రేటర్ వరంగల్ జై భీమ్ ప్రతినిధి : హనుమకొండ దేశంలో ఈడీ, సిబిఐలకు స్వేచ్ఛను ఇస్తే ప్రధానీ మోడీ సహా బిజెపి నాయకులంతా జైలుకు వెళతారని సిపిఐ పార్లమెంటరీ పక్ష నాయకులు బినోయ్ విశ్వం అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన విభజన హామీలు నెరవేర్చాలని, ఉమ్మడి వరంగల్ జిల్లా సమగ్రాభివృద్ది కోసం సిపిఐ చేపట్టిన ప్రజాపోరు యాత్ర ముగింపు సందర్భంగా హనుమకొండలో సిపిఐ బహిరంగ సభ జరిగింది. ప్రెస్ క్లబ్ ఎదురుగా గల కుడా మైదానములో బుధవారం సాయంత్రం ప్రారంభం అయిన ఈ సభకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వేలాది మంది సిపిఐ కార్యకర్తలు, ప్రజలు తరలివచ్చారు. సభకు ముఖ్య అతిథులుగా హాజరైన సిపిఐ పార్లమెంటరీ పక్ష నాయకులు బినోయ్ విశ్వం మాట్లాడుతూ దేశంలో ఆర్ధిక అవకతవకలకు పాల్పడిన ఆదానీ సహా కార్పొరేట్ శక్తులందరికీ మోడీ అండ ఉందన్నారు. మోడీ ప్రధానీ అయ్యాకే అంబానీ ఆస్తులు అమాంతం పెరిగాయని, అవినీతి పరులంతా బిజెపి పాలనలోనే పెరిగిపోయారని చెప్పారు. మోడీ, ఆదానీ వేర్వేరు కాదని, ఒక్కటే నని, ఈడీ, సిబిఐకి ఆదానీని ముట్టుకునే దమ్ము, దైర్యం ఉందా అని ప్రశ్నించారు. ఆదానీ అంశం తెరపైకి రాకుండా పార్లమెంటులో అధికారంలో ఉన్న బిజెపి నే జేపిసి వేయకుండా అడ్డుకున్నదని విమర్శించారు. ప్రజల సమస్యలు పరిష్కారం కాకుండా మతం, కులం పేరుతో బిజెపి ప్రజల మద్య విభేదాలు సృష్టిస్తున్మదని,రాముని పేరు చెపుతున్న బిజెపి నిజానికి రావణుని పాలన కొనసాగిస్తున్నదని, బిజెపి దేవుళ్ల పార్టీ కాదని, దెయ్యాల పార్టీ అని, ఆ పార్టీ నాయకులు రావణుడి వారసులని అన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఏడు దశాబ్దాలు దాటినా ప్రజల సమస్యలు పరిష్కారం కాలేదని, పేదలకు కూడు, నీడ కల్పించబడలేదని, అందుకే ప్రజల పక్షాన, పేదల పక్షాన సిపిఐ పోరాడుతున్నదని అన్నారు. దేశంలో బిజెపి అవినీతి పాలనకు వ్యతిరేకంగా వామపక్ష లౌకిక ప్రజాతంత్ర శక్తులు ఏకం కావాలని, ఏకమైతే బిజెపి సాగనంపడం ఖాయమని అన్నారు. మోడీ హటావో,దేశ్ కి బచావో పేరుతో సిపిఐ జాతీయ పోరాడుతున్నదని అన్నారు. వరంగల్ ఉమ్మడి జిల్లాలో జరుగుతున్న భూ పోరాటాలు చారిత్రాత్మకమని, ఈ పోరాటంలో పేదలు విజయం సాధించడం ఖాయమని అన్నారు. జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ విభజన హామీలు నెరవేర్చకుండా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని అన్నారు. బయ్యారం ఉక్కు, కాజీపేట కోచ్, గిరిజన విశ్వ విద్యాలయం వస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందేదని అన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం పూర్తిగా కార్పొరేట్లకు కొమ్ముగాస్తూ పేదలను విస్మరించిందన్నారు. అందుకే బిజెపి ని దేశం నుండి పారదోలేందుకే బిజెపి హటావో దేశ్ కి బచావో నినాదం ఎత్తుకున్నామని చెప్పారు. రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ సిపిఐ ఎల్లప్పుడూ ప్రజల పక్షమేనని, పాలకుల పక్షం కాదని అన్నారు. పేదలకు ఇండ్లు, ఇండ్ల స్థలాలు ఇవ్వకుంటే పోరాటం తప్పదని, పేపర్ లీకేజీ విషయములో బిజెపి నాయకులు జైలుకు వెళితే తాము ప్రజల కోసం వెళుతామని, బిజెపి పేదల, కష్ట జీవుల కోసం ఏనాడూ పనిచేయదని, మోడీ ప్రభుత్వం ఇచ్చిన హామీలనే నెరవేర్చ లేదని, బిజెపి మత రాజకీయాలు కరోనా కంటే ప్రమాదకరమని, బిజెపిని తరిమికొట్టడం కోసం గొంగళి పురుగు నైనా ముద్దు పెట్టుకంటామని, బిజెపికి వ్యతిరేకంగా పోరాడే వారితో కలిసి పనిచేస్తామని అన్నారు. మానవ జాతి ఉన్నంత వరకూ కమ్యూనిస్టులు ఉంటారని అన్నారు. ఈ బహిరంగ సభ ప్రజానాట్యమండలి కళాకారుల ఆట పాటలతో హోరెత్తింది. ఈ బహిరంగ సభకు సిపిఐ వరంగల్, హనుమకొండ జిల్లా కార్యదర్శులు మేకల రవి, కర్రె బిక్షపతి అద్యక్షత వహించగా జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎంపి సయ్యద్ అజీజ్ పాషా, జాతీయ సమితి సభ్యులు, మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకట్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, పాదయాత్ర కన్వీనర్ తక్కళ్లపల్లి శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శులు బి విజయ సారథి, సిహెచ్ రాజారెడ్డి, కొరిమి రాజ్ కుమార్, తోట మల్లికార్జున రావు, మాజీ ఎమ్మెల్యే పోతరాజు సారయ్య, మహిళా సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నేదునూరి జ్యోతి, ఏఐటియూసి రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి ఉజ్జిని రత్నాకర్ రావు, రాష్ట్ర నాయకులు తమ్మెర విశ్వేశ్వరరావు, పంజాల రమేష్, జిల్లా సహాయ కార్యదర్శులు తోట బిక్షపతి, మద్దెల ఎల్లేష్, షేక్ బాష్ మియా, నాయకులు బి అజయ్, ఆదరి శ్రీనివాస్, మండ సదాలక్ష్మి, వలీ ఉల్లా ఖాద్రి, మారుపాక అనిల్ కుమార్, నల్లు సుధాకర్ రెడ్డి, జంపాల రవిందర్, ఎన్ అశోక్ స్టాలిన్, పి సుగుణమ్మ, పల్లె నర్సింహా, పుట్ట లక్ష్మణ్, మణికంఠ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Admin