జై భీమ్ టీవీ - తెలంగాణ / : ప్రత్యేక రాష్ట్ర కాంక్షను గుర్తించి.. ఇచ్చిన మాట ప్రకారం సోనియా గాంధీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారన్నారు హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్విందర్ సింగ్. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో భాగంగా మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో సుఖిందర్ సుఖు ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. అమరుల త్యాగాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణలో కుటుంబ పాలన సాగుతోందని ఆయన తెలిపారు. హిమాచల్ ప్రదేశ్ లో నిరుద్యోగ యువతకు ఉపాధి కలిపించామన్నారు. తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకు ఓపీఎస్ సిస్టం అమలు చేస్తామని హామీ ఇచ్చారు సుఖ్విందర్. విలాసవంతమైన జీవితాలు, సంపాదన కోసం కాంగ్రెస్ అధికారంలోకి రావాలని కోరుకోదని చెప్పిన సుఖ్విందర్..లక్షలాది మంది ప్రజలకు ఉపాధి కల్పించాలన్నదే లక్ష్యమని వెల్లడించారు. ఒకే కుటుంబంలో ఇద్దరు ప్రధాన మంత్రులు ఇందిరా, రాజీవ్ గాంధీలు ఉగ్రవాదుల ఘాతుకానికి బలయ్యారని గుర్తు చేశారు. కాశ్మీర్–కన్యాకుమారీ వరకు అవినీతి, హింసలకు వ్యతిరేకంగా రాహుల్ గాంధీ పాదయాత్ర చేపట్టారని తెలిపారు. దేశ ప్రధాని అయ్యే అవకాశం ఉన్నా సోనియా గాంధీ పదవీ త్యాగం చేశారని సుఖ్విందర్ కొనియాడారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటుందని స్పష్టం చేశారాయన. మండు టెండలో భట్టి విక్రమార్క పాదయాత్ర చేస్తున్నారు.. రేవంత్, భట్టి విక్రమార్క ఈ అవినీతి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారని.. అందరం కలిసి కుటుంబ పాలనను అంతమొందించాలని సుఖిందర్ సుఖు పేర్కొన్నారు.
Admin