జై భీమ్ టీవీ - తెలంగాణ / : డిసెంబర్ 3న హైదరాబాద్లో బీజేపీ జెండా ఎగరాలి. తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కారు రావాల్సిన సమయం ఆసన్నమైందంటూ బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమరశంఖం పూరించారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తర్వాత తొలిసారి తెలంగాణ వచ్చిన అమిత్ షా.. పార్టీ శ్రేణుల్లో జోష్ నింపడమే కాకుండా ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు. ఆదిలాబాద్లో బీజేపీ ప్రజాగర్జన సభ అనంతరం.. సికింద్రాబాద్లోని ఇంపీరియల్ గార్డెన్స్లో మేధావులు, నిపుణులతో అమిత్ షా భేటీ అయ్యారు. తెలంగాణలో గెలిచేది ఎవరో ప్రజలే ఫైనల్ చేయాలి. ఎవరు గెలిస్తే మేలు జరుగుతుందో ఆలోచించాలంటూ అమిత్ షా కోరారు.. తెలంగాణ ప్రజల ముందు.. బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్.. అనే 3 ఆప్షన్స్ ఉన్నాయి. అందులో అధికారం ఎవరికి ఇవ్వాలో ప్రజలే నిర్ణయించాలంటూ అమిత్ షా పేర్కొన్నారు. ఈ సందర్భంగా పదేళ్ల క్రితం ఉన్న దేశపరిస్థితులను వివరించిన అమిత్ షా.. వ్యవస్థ అంతా కుప్పకూలిన పరిస్థితులు నాడు కనిపించాయంటూ వివరించారు. దేశ రాజధానిలో కూడా మహిళలకు రక్షణ లేకుండా పోయిందని.. అప్పట్లో మన్మోహన్ సింగ్ మౌనంగా కూర్చొని చూస్తూ ఉండిపోయారంటూ ఎద్దెవా చేశారు. 2014లో ఈ దేశ ప్రజలు గొప్ప నిర్ణయం తీసుకున్నారని.. అవినీతి మచ్చ లేకుండా 9 ఏళ్లుగా మోదీ పరిపాలిస్తున్నారని తెలిపారు. ప్రధాని మోదీ మాటలు వినేందుకు ప్రపంచమంతా ఎదురుచూస్తోందంటూ అమిత్ షా పేర్కొన్నారు. 50 రోజులే.. ఇక మొదలు పెట్టండి.. ఈ సందర్భంగా తెలంగాణ బీజేపీ ముఖ్యనేతలతో కేంద్ర మంత్రి అమిత్ షా ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ నేతలతో చర్చించారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిణామాలు ఎలా ఉన్నాయి. ఈ 50 రోజులు ఎలా పనిచేయాలనే దానిపై పార్టీ శ్రేణులకు సూచించారు. అధిష్టానం నుంచి అందే సహకారం.. నేతల మధ్య సమన్వయం, పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తీసుకోవాల్సిన చర్యలు.. రాబోయే కాలంలో నిర్వహించే బహిరంగ సభలు.. అభ్యర్థుల ప్రకటన తదితర అంశాలపై కూడా అమిత్ షా మాట్లాడినట్లు తెలుస్తోంది. అయితే, అన్నింటికన్నా ముందు ఆదిలాబాద్ జనగర్జన సభలో అమిత్ షా పాల్గొని.. అధికార పార్టీపై ఫైర్ అయ్యారు. కుమురంభీంను స్మరించుకుంటూ ప్రసంగం ప్రారంభించిన అమిత్ షా.. పవిత్ర భూమి ఆదిలాబాద్ రావడం సంతోషంగా ఉందన్నారు. యూనివర్సిటీల దగ్గర నుంచి.. కేంద్రం, రాష్ట్రం మధ్య పంచాయితీ నడుస్తున్న అన్ని అంశాలను అమిత్ షా ప్రస్తావించారు.
Admin