జై భీమ్ టీవీ - తెలంగాణ / : కర్నాటకలో తాము అమలు చేస్తున్న గ్యారెంటీలపై సందేహాలు ఉంటే అక్కడి వెళ్లి చూడాలని BRS నేతలకు సూచించారు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. కర్నాటక గురించి కిరాయి మనుషులతో బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేయిస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ అభ్యర్థుల తరపున ఆయన తెలంగాణలో ప్రచారం చేశారు. తెలంగాణలో ఆరు గ్యారెంటీలు పక్కగా అమలు చేస్తాం.కర్నాటకలో ఐదు గ్యారెంటీలు బేషుగ్గా అమలవుతున్నాయి. డౌట్ వుంటే వెళ్లి చెక్ చేస్కోండని బీఆర్ఎస్కు సవాల్ విసిరారు AICC చీఫ్ మల్లికార్జున్ ఖర్గే. అభ్యర్థుల ఎంపిక దాదాపు పూర్తవడంతో తెలంగాణలో ప్రచారంపై కాంగ్రెస్ దృష్టి సారించింది. కర్నాటక ఉపముఖ్యమంత్రి DK శివకుమార్ శనివారం ప్రచారం చేయగా, తాజాగా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సంగారెడ్డి, మెదక్లో ప్రచారం నిర్వహించారు. సంగారెడ్డిలో నిర్వహించిన సభలో తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యనేతలందరూ పాల్గొన్నారు. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీని BRS ఇప్పుడు విమర్శిస్తోందని ఖర్గే అన్నారు. ఇందిరా గాంధీ గతంలో ఇక్కడి నుంచే గెలిచి కాంగ్రెస్ పార్టీని ఉన్నతంగా నిలిపారని ఖర్గే అన్నారు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ అని, ప్రస్తుత BRS పాలకులు సోనియా గాంధీ ఇంటికెళ్లి ఫొటోలు దిగి, కాళ్లుమొక్కారని ఖర్గే గుర్తు చేశారు. తెల్లారేసరికి మారిపోయారని ఆరోపించారు. మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల రాష్ట్రంగా BRS మార్చేసిందని ఆరోపించారు. బీజేపీకి బీ టీమ్గా వ్యవహరిస్తున్న BRS,వాళ్లు మాట్లాడిన మాటలను వల్లె వేస్తోందని విమర్శించారు. స్వాతంత్య్రాన్ని మీరు తెచ్చారా? మీ బంధువులు తెచ్చారా? బీజేపీ తెచ్చిందా? బీఆర్ఎస్ తెచ్చిందా? తెచ్చింది మేము, కష్టపడింది మేము. కష్టపడి మేము దేశాన్ని నిర్మించాం. 70 ఏళ్లలో ఏం చేశారని మమ్మల్ని బీజేపీ ప్రశ్నిస్తుంది. మోదీ అడుగుతూ ఉంటారు. వాళ్లు అంటున్నారని వాళ్ల బీ టీమ్ బీఆర్ఎస్ కూడా అదే అడుగుతోంది. నాకనిపిస్తుంది ఆ రెండు పార్టీలు కలిసే ఉన్నాయని. వాళ్లకు ఎందులో అయితే ప్రయోజనం ఉంటుందో అదే చేస్తారు. వాళ్లు పోరాటం చేయరు. పోరాటం చేసేది కాంగ్రెస్ ఒక్కటే. కర్నాటకలో తాము ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నామని మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు. నాలుగు ఇప్పటికే పూర్తి చేశామని, ఐదో హామీ కూడా త్వరలో అమల్లోకి వస్తోందని తెలిపారు. కాని, అక్కడ అమలు చేయడం లేదని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఖర్గే ఆరోపించారు. సంగారెడ్డి తర్వాత మెదక్లో కాంగ్రెస్ అభ్యర్థి మైనంపల్లి రోహిత్ తరపున మల్లికార్జున ఖర్గే ప్రచారం నిర్వహించారు. బోధన్ ఎక్స్ రోడ్డు నుంచి రాందాస్ చౌరస్తా వరకు నిర్వహించిన బస్సు యాత్రలో ఖర్గే పాల్గొన్నారు.
Admin