జై భీమ్ టీవీ - తెలంగాణ / : హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఇంద్రనగర్లోని రాఘవ గెస్ట్ హౌస్ లాడ్జిలో దారుణం చోటు చేసుకుంది. మద్యం మత్తులో నలుగురు డ్యాన్సర్లు వాచ్మెన్ను మూడో ఫ్లోర్ నుంచి తోసేశారు. తీవ్రంగా గాయపడిన వాచ్మెన్ యాదగిరి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈనెల 20న షూటింగ్ నిమిత్తం చెన్నై నుంచి వచ్చిన నలుగురు డ్యాన్స్ర్లు రాఘవ గెస్ట్ హౌస్ లాడ్జిలో రూం బుక్ చేసుకుని ఉంటున్నారు. అయితే ఏప్రిల్ 27వ తేదీ గురువారం అర్థరాత్రి నలుగురు డ్యాన్సర్లు మద్యం మత్తులో హోటల్ సిబ్బందితో గొడవకు దిగారు. దీంతో సిబ్బంది విషయాన్ని వాచ్మెన్ యాదగిరికి తెలియజేశారు. యాదగిరి వచ్చి వారిని అదుపు చేసే ప్రయత్నం చేశాడు. అయినా వినని డ్యాన్సర్లు.. యాదగిరితోనూ వాగ్వాదానికి దిగారు. ఇదే క్రమంలో డ్యాన్సర్లు యాదగిరిని మూడో ఫ్లోర్ నుంచి నెట్టివేశారు. ఈ ఘటనలో హాస్పిటల్లో చికిత్స పొందుతూ యాదగిరి మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న బంజారాహిల్స్ పోలీసులు.. మని, దిన అనే ఇద్దరు డ్యాన్సర్లను అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు నిందితులు నరేష్, నాగరాజు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. వారి కోసం గాలిస్తున్నారు. యాదగిరి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి..కుటుంబసభ్యులకు అప్పగించనున్నారు. యాదగిరి మృతితో ఆయన కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. నిందితులను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని యాదగిరి కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు.
Admin