జై భీమ్ టీవీ - తెలంగాణ / : మెదక్ ఎంపీ, దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం రాష్ట్ర వ్యాప్తంగా ఎంతటి కలకలం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎంపీ స్థాయిలో ఉన్న ఓ వ్యక్తిపై దుండడుగు కత్తితో దాడి చేయడం తీవ్ర కలవరం రేపింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం దౌల్తాబాద్లోని సూరంపల్లికి వెళ్లిన ప్రభాకర్ రెడ్డిపై పెద్దచెప్యాలకు చెందిన గట్టని రాజు అనే వ్యక్తి కత్తితో దాడి చేశాడు. గన్మెన్ రాజు వెంటనే అలర్ట్ అయ్యి రాజును పట్టుకొని కత్తిని లాగేసుకున్నాడు. దీంతో కొత్త ప్రభాకర్ రెడ్డిని వెంటనే గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అనంతరం వైద్యుల సూచన మేరకు ప్రభాకర్ రెడ్డిని సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు సత్వరమే చికిత్స అందించారు. చిన్న పేగుకు తీవ్ర గాయమైందని గుర్తించిన వైద్యులు. పొట్టలోనే తీవ్ర రక్తస్రావమైందని తెలిపారు. 10 సెంటీమీటర్ల వరకు పేగు పూర్తిగా దెబ్బతినడంతో ఓపెన్ లాపరోటమీ చేసి దెబ్బతిన్న పేగును తొలగించినట్లు, ఇందుకు మూడున్నర గంటల పాటు సమయం పట్టిందని వైద్యులు తెలిపారు. అనంతరం ప్రభాకర్ రెడ్డిని ఐసీయూకు పంపించారు. మరో వారం రోజులు పాటు చికిత్స అందించాల్సి ఉంటుందని తెలిపారు. సీఎం కేసీఆర్ పరామర్శ.. ఇదిలా ఉంటే ఎంపీపై దాడి జరిగిన విషయం తెలిసిన వెంటనే మొదల మంత్రి హరీష్ రావు హుటాహుటిన ఆసుపత్రికి చేరుకున్నారు. ప్రభాకర్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఇక ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం సికింద్రాబాద్ యశోద సుపత్రికి వెళ్లారు. కామారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో పర్యటన అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ రాత్రి 8 గంటల ప్రాంతంలో ఆసుపత్రికి చేరుకుని ప్రభాకర్రెడ్డిని పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగిన తెలుసుకున్న సీఎం, మెరుగైన వైద్యం అందించాలని వారికి సూచించారు. ప్రభాకర్రెడ్డి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని మంత్రి హరీశ్రావును ఆదేశించారు. ఇక ఈ సమయంలో ప్రభాకర్ రెడ్డిని రక్షించిన గన్మెన్కు కేసీఆర్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. కత్తిని లాక్కొని ఎంపీని రక్షించినందుకు గాను గన్మెన్కు చేతులెత్తి కృతజ్ఞతలు తెలిపారు సీఎం. అనంతర ప్రభాకర్ రెడ్డి కుటుంబ సభ్యులను ఓదార్చారు. పార్టీ అన్ని విధాల అండగా ఉంటుందని, ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించి చర్యలు తీసుకుంటామన్నారు.
Admin