జై భీమ్ టీవీ - తెలంగాణ / : ప్రవళిక సూసైడ్ కేసు తెలంగాణలో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అశోక్నగర్లో ఆత్మహత్యకు పాల్పడిన ప్రవళిక సూసైడ్కు సంబంధించి ఆమె కుటుంబీకులు వాళ్ల వాళ్ల వాగ్మూలాన్ని పోలీసులకు వెల్లడించారు. శివరామ్ అనే యువకుడి వేధింపులతోనే తన కూతురు ప్రవళిక బలవన్మరణానికి పాల్పడిందని ఆమె తల్లి విజయ పేర్కొంది. రాజకీయాల కోసం ప్రవళిక మరణాన్ని వాడుకోవద్దంటూ ప్రవళిక తల్లి, సోదరుడు కోరారు. పరీక్షలు వాయిదా వల్లనే ప్రవిళక చనిపోయినట్లు చెప్పాలని కొందరు నేతలు చేస్తున్న ఒత్తిడిని కుటుంబీకులు మీడియా ముందుకు తీసుకొచ్చారు. దయచేసి తమను వేధించండం ఆపాలని అందరినీ కోరారు. కాగా.. హైదరాబాద్ అశోక్ నగర్లోని ఓ హాస్టల్ లో ఉంటూ పోటీ పరీక్షలకు సిద్ధం అవుతున్న ప్రవళిక గత వారం ఆత్మహత్య చేసుకుంది. అయితే, పరీక్షల వాయిదా వల్లనే ఆమె చనిపోయిందంటూ పలు పార్టీల నేతలు, ప్రజా సంఘాలు ఆరోపిస్తున్న నేపథ్యంలో.. ప్రవళిక తల్లి .. సోదరుడు మీడియాతో మాట్లాడారు. ప్రవళిక మరణాన్ని రాజకీయాలకు వాడుకోవద్దంటూ సూచించారు. గొడవలు ఉంటే మీరు చూస్కోండి.. ముందుగా ప్రవళిక తల్లి మర్రి విజయ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘మా అమ్మాయి పేరు మర్రి ప్రవళిక. రెండు సంవత్సరాల నుంచి నేను నా బిడ్డను అక్కడ చదివించుకుంటున్న. నా కొడుకు కూడా అక్కడే చదువుకుంటున్నాడు. మేమే ఎండల కాయ కష్టం చేసి పిల్లలను చదివిస్తున్నాం. మా పిల్లలకు ఆ కష్టం రాకూడదు అని అక్కడ పంపి చదివిపిస్తున్నాం. కానీ, వాడు మా పిల్లను వేధించాడు. వాడి టార్చర్ భరించలేక మా అమ్మాయి కనీసం మాతో కూడా చెప్పుకోలేక ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. నా బిడ్డను చావుకు కారణమైన వాడిని శిక్షించాలి. వాడిని బయటకు రాకుండా చేయాలి. నా బిడ్డ కష్టం వేరే వాళ్లకు రాకూడదు. మీకు పార్టీల పరంగా ఏమైనా గొడవలు ఉంటే మీరు చూస్కోండి అంతే కానీ మా కుటుంబాన్ని అందులో లాగకండి. నా బిడ్డను చావుకు కారణమైన వాడిని మాత్రం బయటకు రానీయకండి. నా బిడ్డ మాదిరిగానే వాడికి శిక్ష వేయండి.’’.. అంటూ వాపోయారు. మా దగ్గరికి రావొద్దు.. ప్రవళిక తమ్ముడు కుమార్ మాట్లాడుతూ.. ‘‘అక్క హాస్టల్ కు నా హాస్టల్ కు 5 నిముషాల దూరం ఉంటుంది. వారానికి మూడు నాలుగు సార్లు కలిసి మాట్లాడుకుంటాం. ముఖ్యంగా అక్క ప్రవళిక చనిపోవడానికి కారణం శివరామ్ అనే వ్యక్తి వేరే అమ్మాయి వల్ల పరిచయం అయ్యాడు. అప్పటినుండి అక్కకి ఇష్టం లేకపోయినా తనతో మాట్లాడడం, కాల్ చెయ్యడం, హాస్టల్ కి వచ్చి అందరి ముందు మాట్లాడమని ఇబ్బంది పెట్టడం వల్ల, అక్కకు ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఆఖరికి అమ్మకు, నాన్నకు , నాకు ఎవరికి చెప్పిన ఏమంటారో ఎం ప్రోబ్లం వస్తుందో ఇంట్లో అని చాలా డిప్రషన్ లోకి వెళ్ళిపోయి సూసైడ్ చేసుకుంది. ముఖ్యంగా అక్క చనిపోవడానికి కారణం హాస్టల్ దగ్గర చదువుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఏడిపించడం, కాల్ చెయ్యడం, ఫ్రెండ్స్ ఫోన్ నుండి ఇలా వేరే వేరే నెంబర్స్ నుండి కాల్ చెయ్యడం వల్ల ఎవరికి చెప్పుకోవాలో తెలియక సూసైడ్ చేసుకుంది. అక్కకి ఇప్పుడు న్యాయం జరగాలంటే శివ రామ్ ని ఎక్కడ ఉన్న పట్టుకుని తన అక్క చనిపోయిన్నట్టుగా ఉరి తీసి గాని ఎన్ కౌంటర్ గాని చేసి ప్రభుత్వం మాకు న్యాయం చెయ్యాలి. ప్రభుత్వం, కేసీఆర్ చేసారని చెప్తున్నారు కానీ వారు చెయ్యలేదు. గాని మాకు న్యాయం చెయ్యాలనుకుంటే వాడిని శిక్షించాలి. చాలా మంది మాఇంటికి వచ్చి ఏదో ఒకటి చెప్పడం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అవని ఏ పార్టీ అవని మా దగ్గరకి రావద్దు’’ అంటూ కోరారు.
Admin