జై భీమ్ టీవీ - తెలంగాణ / : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను ఈసీ ప్రకటించడంతో ఎన్నికల ప్రచారం జోరందుకుంటోంది. అనారోగ్యం నుంచి పూర్తిగా కోలుకున్న సీఎం కేసీఆర్.. అక్టోబర్ 15 నుంచి తెలంగాణ రాష్ట్రంలో విస్తృత పర్యటనలు చేపట్టేందుకు రెడీ అయిపోయారు. అటు బీజేపీ, కాంగ్రెస్ కూడా ప్రచార పర్వంపై ఫుల్ ఫోకస్ పెట్టాయి. తెలంగాణలో పార్టీ విజయమే లక్ష్యంగా.. ఆ పార్టీల జాతీయ నేతలు నేరుగా రంగంలోకి దిగుతున్నారు. తెలంగాణ ఎన్నికల ప్రచారం కోసం కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వచ్చే వారం తెలంగాణ పర్యటనకు రానున్నారు. ఈ నెల 18న వారిద్దరూ జగిత్యాలలో పర్యటించనున్నారు. ముందుగా కొండగట్టు అంజన్నను దర్శించుకుని తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా వారి వెంట కొండగట్టు ఆలయాన్ని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. కొండగట్టు అంజన్నను దర్శించుకున్న తర్వాత ఆ రోజు సాయంత్రం జగిత్యాలలో బహిరంగ సభలో పాల్గొంటారు. రాహుల్ గాంధీ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లలో రాష్ట్ర కాంగ్రెస్ నేతలు, జగిత్యాల జిల్లా పార్టీ నేతలు తలమునకలయ్యారు. జగిత్యాలలోని కొత్త బస్టాండ్ వద్ద ఆ రోజు సాయంత్రం రాహుల్ గాంధీ రోడ్ షో నిర్వహించనున్నారు. కొండగట్టు ఆలయాన్ని 18 తేదీన మధ్యాహ్నం రాహుల్ గాంధీ దర్శించుకుంటారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. అక్కడ పూజల అనంతరం ప్రచార రథాల(బస్లు) ను రాహుల్ గాంధీ ప్రారంభిస్తారని తెలిపారు. కొండగట్టు నుంచి ప్రచారరథంలో రాహుల్ గాంధీ జగిత్యాలకు చేరుకుంటారని వివరించారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సభను విజయవంతం చేసేందుకు కాంగ్రెస్ రాష్ట్ర నేతలు భారీ జనసమీకరణ చేపట్టనున్నారు. అక్టోబర్ 18 నుంచి 20 తేదీ వరకు రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటిస్తారని తెలుస్తోంది. తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒకే విడతలో నవంబరు 30న పోలింగ్ నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించడం తెలిసిందే. మరో నాలుగు రాష్ట్రాలతో కలిసి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపును డిసెంబరు 3న చేపట్టనున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్ను ఓడించి అధికార పగ్గాలు చేపట్టాలని కాంగ్రెస్ ఉవ్విళ్లూరుతోంది. తెలంగాణ ఇచ్చిన పార్టీగా చెప్పుకుంటున్న కాంగ్రెస్.. ఓటర్లను తమ వైపునకు తిప్పుకునేందుకు ఇప్పటికే ఆరు జనాకర్షక హామీలను ప్రకటించింది. తెలంగాణలో తమ పార్టీ అధికారంలోకి వస్తుందని రాహుల్ గాంధీ.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ధీమా వ్యక్తంచేశారు. తెలంగాణలో పార్టీ అభ్యర్థులను కాంగ్రెస్ ఇంకా ఖరారు చేయలేదు. వచ్చేవారం పార్టీ అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ అధిష్టానం విడుదల చేసే అవకాశముందని తెలుస్తోంది. పార్టీ అభ్యర్థిత్వాన్ని ఆశించి నిరుత్సాపడే నేతలను సముదాయించే ప్రయత్నాలను ఆ పార్టీ నేతలు ఇప్పటికే మొదలుపెట్టారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక 1000 నామినేటెడ్ పోస్టులతో టిక్కెట్లు దక్కని వారికి న్యాయం చేస్తామని రేవంత్ రెడ్డి వారికి హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
Admin