జై భీమ్ టీవీ - తెలంగాణ / : తెలంగాణ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. దీంతో ప్రధాన పార్టీలన్నీ పక్కా వ్యూహాలతో దూసుకెళ్తున్నాయి. అయితే, ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల నామినేషన్ల విత్ డ్రాకు కూడా సమయం ముగిసింది. దీంతో ప్రధాన పార్టీలు అన్నీ తమ ప్రచార జోరును పెంచాయి. 119 నియోజకవర్గాలకు సంబంధించి అన్ని పార్టీల అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్లలో 100కోట్లకు పైబడి ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య కేవలం 6 అభ్యర్థులు మాత్రమే.. ఐదు రాష్ట్రాల ఎన్నికలతో పోలిస్తే తెలంగాణలోనే అత్యధిక సంపన్న ఎమ్మెల్యేలు ఉన్నారు. అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్లను పరిశీలిస్తే మూడు ప్రధాన పార్టీ అభ్యర్థులు 100 కోట్లకు పైబడి ఉన్నారు. ప్రధాన పోటీ అధికార బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్యనే నెలకొని ఉంది. మొత్తం 119 నియోజకవర్గాలకు సంబంధించి 6 అభ్యర్థులు తమ ఆస్తులు 100 కోట్ల పైబడి ఉన్నట్లు ప్రకటించారు. అధికార బీఆర్ఎస్ పార్టీ నుంచి దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే అభ్యర్థి పైళ్ల శేఖర్ రెడ్డి, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే అభ్యర్థి మర్రి జనార్దన్ రెడ్డి 100 కోట్ల క్లబ్ లో ఉన్నారు. వీరు ప్రకటించిన ఆస్తులు వివరాలు ఇలా ఉన్నాయి. దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి 197 కోట్ల ఆస్తులు ప్రకటించగా, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే అభ్యర్థి మర్రి జనార్థన్ రెడ్డి 112 కోట్ల ఆస్తులను ప్రకటించారు. ఇక భువనగిరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పైళ్ల శేఖర్ రెడ్డి అధికారికంగా తనకు 277 కోట్ల ఆస్తులు ఉన్నట్టు ప్రకటించారు. ఇక బీజేపీ నుండి కోరుట్ల ఎమ్మెల్యే అభ్యర్థి ధర్మపురి అరవింద్ తనకు రూ. 106 కోట్ల ఆస్తులు ఉన్నట్టు ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఇద్దరు ఎమ్మెల్యే అభ్యర్థులు 100 కోట్ల పైబడి ఆస్తులు ఉన్నట్లు ప్రకటించారు. మునుగోడు ఎమ్మెల్యే అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తనకు 458 కోట్ల ఆస్తులు ఉన్నట్లు ప్రకటించగా, చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ తనకు 606 కోట్ల ఆస్తులు ఉన్నట్లు ప్రకటించారు. వీరిలో అధికారిక బీఆర్ఎస్ పార్టీకి చెందిన ముగ్గురు రూ.100 కోట్ల అభ్యర్థులపై ఇటీవల ఐటి అధికారులు సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. కొత్త ప్రభాకర్ రెడ్డి, మర్రి జనార్దన్ రెడ్డి, పైళ్ళ శేఖర్ రెడ్డి నివాసాలు, కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఎన్నికలకు కొద్ది నెలల ముందు ఇన్కమ్ టాక్స్ అధికారులు సోదాలు చేశారు. వీరు ముగ్గురు కలిసి పలు వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ తో పాటు పలు ప్రాంతాల్లో ఈ ముగ్గురు బిజినెస్ పార్టనర్లుగా ఉన్నారు. గత ఎన్నికల్లో కొత్త ప్రభాకర్ రెడ్డి ఎంపీగా పోటీ చేసి గెలిచారు. ఇక తాజాగా దుబ్బాక బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా కొత్త ప్రభాకర్ రెడ్డి పోటీచేస్తున్నారు. అక్టోబర్ 30న కొత్త ప్రభాకర్ రెడ్డిపై రాజు అనే యూట్యూబర్ కత్తితో దాడి చేశాడు. ఈ దాడి తర్వాత అధికారిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులకు 4+4 భద్రత ను కేటాయించారు.
Admin