జై భీమ్ టీవీ - ఆంధ్ర ప్రదేశ్ / విజయవాడ : ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో మహిళపై గ్యాంగ్ రేప్ ఘటన కలకలం రేపింది. నలుగురు వ్యక్తులు కలిసి మహిళకు బలవంతంగా మద్యం తాగించి.. గదిలో బంధించి మూడు రోజుల పాటు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన పెనమలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకోగా.. సోమవారం రాత్రి వెలుగులోకి వచ్చింది. బాధితురాలు విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతుందని పోలీసులు తెలిపారు. ఈ గ్యాంగ్ రేప్ కేసు ఘటనలో ముగ్గురిని అరెస్టు చేసి విచారిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయవాడ నగరంలోని బెంజి సర్కిల్ వద్ద కూలి పనులు చేసుకుని బతికే ఓ మహిళను కొందరు టార్గెట్ చేశారు. అదే ప్రాంతంలోని సులభ్ కాంప్లెక్స్ లో పని చేసే వ్యక్తి ఈ నెల 17న నమ్మించి కానూరు సనత్ నగర్లోని ఓ గదికి తీసుకువెళ్లాడు. అక్కడ అతడితో పాటు మరో ముగ్గురు స్నేహితులు జతకలిశారు. ఆమెకు మద్యం తాపించి.. మూడు రోజుల పాటు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. మద్యం మత్తులో ఉన్న బాధితురాలు తీవ్ర అస్వస్థతతో సోమవారం నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేరడంతో ఈ అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. ఆసుపత్రి సిబ్బంది సమాచారంతో పెనమలూరు పోలీసులు బాధితురాలితో మాట్లాడారు. సోమవారం రాత్రి సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి.. నిందితుల కోసం గాలించారు. సులభ్ కాంప్లెక్స్లో పనిచేసే ఓ వ్యక్తితో పాటు మరో ముగ్గురు ఈ దారుణానికి ఒడిగట్టినట్టు గుర్తించారు పోలీసులు. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు
Admin