జై భీమ్ టీవీ - ఆంధ్ర ప్రదేశ్ / : స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టయి.. రిమాండ్లో ఉన్న టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జైల్లో తన భద్రత, ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు చంద్రబాబు ఏసీబీ కోర్టు జడ్జికి లేఖ రాశారు. ఈనెల 25న చంద్రబాబు రాసిన మూడు పేజీల లేఖను జైలు అధికారులు జడ్జికి పంపారు. పెన్ను కెమెరాతో ఒక రిమాండ్ ఖైదీ జైల్లో తిరుగుతున్నాడని లేఖలో పేర్కొన్నారు. తనను చంపుతామని మావోయిస్టుల పేరుతో లేఖ వచ్చిందని.. తనను హత్య చేసేందుకు కోట్ల రూపాయలు చేతులు మారాయని లేఖలో తెలిపారు చంద్రబాబు. ఈ కుట్రపై తూర్పుగోదావరి జిల్లా ఎస్పీకి లేఖ కూడా వచ్చిందని.. దానిపై ఇప్పటి వరకు పోలీసు అధికారులు ఎలాంటి విచారణ చేపట్టలేదన్నారు. రాజమండ్రి జైలుపై ఈ మధ్య తన కుంటుం కలిసేందుకు వచ్చిన సమయంలో ఒక డ్రోన్ తిరిగిందని తెలిపిన బాబు.. జైలు, దాని చుట్టుపక్కల భద్రతను కట్టుదిట్టం చేయాలని లేఖలో కోరారు. గంజాయి ప్యాకెట్లు జైలు ప్రాంగణంలో గార్డెనింగ్ చేస్తున్న ఖైదీల వద్దకు విసిరేస్తున్నారని చంద్రబాబు లేఖలో చెప్పుకొచ్చారు. చంద్రబాబు లేఖలో రాసిన ప్రతి ఇష్యూపై జైళ్ల శాఖ డిఐజి రవికిరణ్ వివరణ ఇచ్చారు. మావోయిస్టుల పేరుతో వచ్చిన లేఖ నిజం కాదని తేలిందన్నారు. శ్రీనివాస్ చక్రవర్తి అనే వ్యక్తి దొంగతనం కేసులో లోపలికి వచ్చాడు.. అతని జేబులో బటన్ కెమెరా దొరికింది. వెంటనే దాన్ని గుర్తించి పోలీసులకు అందజేశాం.. బటన్ కెమెరాను అతను జైలు లోపలికి తీసుకువెళ్లలేదని డీఐజీ రవికిరణ్ వివరించారు. మరోవైపు చంద్రబాబు కుడి కంటికి ఆపరేషన్ చేయాలంటూ వస్తున్న వార్తలపై కూడా వివరణ ఇచ్చారు డీఐజీ రవికిరణ్. చంద్రబాబుకు ఇప్పటికిప్పుడు అర్జెంట్గా కంటి ఆపరేషన్ అవసరం లేదని వైద్యులు చెప్పినట్లు తెలిపారు. లేఖలో రాసిన సమాచారాన్ని మార్చడం కరెక్ట్ కాదన్నారు. జైల్లో చంద్రబాబు భద్రతపై పూర్తి క్లారిటీతో ఉన్నామని డీఐజీ రవికిరణ్ స్పష్టంచేశారు. ఇలా మొత్తానికి చంద్రబాబు నాయుడు రాసిన లేఖ ఏపీ రాజకీయాల్లో కలకలం రేపింది. దీనిపై తెలుగుదేశం పార్టీ నేతలు స్పందిస్తున్నారు. లేఖలో చాలా సీరియస్ విషయాలున్నాయని, వాటిని ACB కోర్టు జడ్జి సీరియస్గా తీసుకోవాలంటూ కోరుతున్నారు.
Admin