జై భీమ్ టీవీ - ఆంధ్ర ప్రదేశ్ / : తల్లిదండ్రులు చేసిన పుణ్య ఫలమో…లేదా వారి జాతక ఫలమో తెలియదు గానీ కొందరు చావు అంచువరకు వెళ్లి బయట పడుతూ ఉంటారు. చివరి క్షణంలో ఏదో రూపంలో ఓ అదృశ్య శక్తి వారిని కాపాడుతూ ఉంటుంది. అది వారికి నిజంగా పునర్జన్మేనని చెప్పాలి. ఇటువంటి ఘటనలు చూసినవారెవరైనా వారికి ఇంకా భూమ్మీద నూకలు ఉన్నాయనే చెబుతారు. సరిగ్గా అలాంటి ఘటనే శ్రీకాకుళం జిల్లా పలాస రైల్వే స్టేషన్లో చోటు చేసుకుంది. తొమ్మిదవ తరగతి చదువుతున్న పలాసకి చెందిన ఓ బాలుడు ఇంటి వద్ద తల్లిదండ్రులు మందలించారని సూసైడ్కి యత్నించి చివరి నిమిషంలో బతికి బట్టకట్టాడు. ఇంటి వద్ద స్కూల్కి వెళుతున్నానని చెప్పి గురువారం ఉదయం పలాస రైల్వే స్టేషన్కి చేరుకున్నాడు. ప్లాట్ఫారం నుంచి కిందకు దిగి ట్రైన్ వచ్చే ముందు ఆత్మహత్య చేసుకునేందుకు రైల్వే ట్రాక్ పై అడ్డంగా పడుకున్నాడు ఆ బాలుడు. వెంటనే అది గమనించిన GRP ఎస్సై షరీఫ్ అతని సిబ్బంది సకాలంలో స్పందించి బాలుడి ప్రాణాలను కాపాడారు. అయితే GRP పోలీసులను చూసిన బాలుడు తీవ్ర భయాందోళనకు గురయ్యాడు. తప్పయిపోయిందని ఇంకెప్పుడు ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడనని బావురుమని ఏడుస్తూ SI కాలు పట్టుకుని ప్రాధేయపడ్డాడు. తానేమి చేయనంటూ బాలుడుని సముదాయించి అక్కడ నుంచి తీసుకువెళ్లారు. తర్వాత తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి స్టేషన్కి పిలిపించారు. అసలు విషయం తెలుసుకున్నారు. బాలుడు చదువుపై దృష్టి పెట్టడం లేదని ఇంటి వద్ద తల్లిదండ్రులు మందలించారని తెలుసుకుని.. సదరు బాలుడికి, అతని తల్లిదండ్రులకు పోలిసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. అనంతరం కుటుంబ సభ్యులకు బాలుడిని అప్పజెప్పారు. సకాలంలో స్పందించి బాలుడి ప్రాణాలు కాపాడిన GRP SIని, సిబ్బంది హెచ్.సి పి కోదండరావు, నాగరాజు, ఎమ్ సంతోష్ కుమార్, దేవేంద్రలను బాలుడి కుటుంబ సభ్యులు, స్థానికులు అభినందించారు. ఈ రోజుల్లో యువత ఆవేదనకు గురవుతూ తీవ్ర నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఏ మాత్రం ఆలోచించటం లేదు. తల్లిదండ్రులు మందలించారనో,చదువులో వెనుకబడ్డారనో ,స్నేహితులు అవహేళన చేశారనో, ప్రేమలో ఫెయిల్ అయ్యారనో అఘాయిత్యాలకి పాల్పడుతున్నారు. యువతే కాదు ముక్కు పచ్చలారని మైనర్ల మెదడులో సైతం ఈ మధ్య ఇటువంటి ఆలోచనలే మెదలటం నేటి సమాజంలో మరింత ఆందోళన కలిగిస్తోంది. చిన్న వయసులోనే నిండు నూరేళ్ళ జీవితానికి ముగింపు పలుకుతుండటం కలిచి వేస్తుంది. క్షణికావేశంలో అటు వారి భవిష్యత్కు చేతులారా ముగింపు పలకడంతో పాటు తల్లిదండ్రులకు జీవితాంతం కడుపు కోతను మిగిలిస్తున్నారు. తీవ్ర ఆవేదనకు గురైనప్పుడు కాసేపు ఓపిక,సహనం పట్టాలని, క్షణికావేశ నిర్ణయాలు తీసుకోకూడదని మానసిక నిపుణులు చెబుతున్నారు. తల్లిదండ్రులు కూడా పిల్లలపై చదువు విషయంలో ఒత్తిడి తేకూడదని అంటున్నారు. కోపంలో పిల్లలను మందలిస్తే ఒకటి రెండు రోజులు వారి మానసిక పరిస్థితిని అబ్జర్వ్ చేయాలని సూచిస్తున్నారు.
Admin