జై భీమ్ టీవీ - ఆంధ్ర ప్రదేశ్ / : అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్పు కేసులో సీఐడీ ఎదుట నారా లోకేష్ రెండో రోజు విచారణకు హాజరవుతున్నారు.నిన్న మొదటి రోజు లోకేష్ ను సీఐడీ అధికారులు ప్రశ్నించారు.ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ లోకేష్ ను సీఐడీ అధికారులు విచారించారు.ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్పు ద్వారా హెరిటేజ్ సంస్థకు లబ్ది చేకూర్చేలా నారా లోకేష్ వ్యవహరించారని సీఐడీ ప్రధాన అభియోగం.దీనికి సంబంధించి మొదటి రోజు విచారణ కొనసాగింది.హైకోర్టు ఆదేశాల ప్రకారం లాయర్ సమక్షంలో లోకేష్ ని సీఐడీ అధికారులు విచారించారు.ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటలవరకూ కొనసాగిన విచారణలో మధ్యలో గంటపాటు లంచ్ విరామం ఇచ్చారు.అయితే లోకేష్ విచారణ జరుగుతున్న సమయంలోనే విచారణాధికారిగా ఉన్న జయరామరాజు స్థానంలో డీఎస్పీ విజయ్ భాస్కర్ ను నియమిస్తున్నట్లు ఏసీబీ కోర్ట్ లో సీఐడీ మెమో దాఖలు చేసింది.మొదటి రోజు సుదీర్ఘ విచారణ జరిగినప్పటికీ..ఇంకా సమాచారం కావాలని…రెండో రోజు కూడా విచారణ కు హాజరుకావాలని 41 A నోటిస్ ఇచ్చారు…దీంతో ఇవాళ కూడా సీఐడీ విచారణ కు హాజరవుతానని లోకేష్ తెలిపారు. లోకేష్ పై సీఐడీ 30 ప్రశ్నలు.. మొదటి రోజు సీఐడీ అధికారులు విచారణ సందర్భంగా అధికారులు లోకేష్ ని 30 ప్రశ్నలు అడిగారు. ముఖ్యంగా ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ ప్రతిపాదన, లేదా దానికి సంబంధించిన చర్చ ఎప్పుడైనా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ముందుకు వచ్చిందా అని ప్రశ్నించింది సీఐడీ. జిఓ 282 ద్వారా 99 మందికి రాజధాని ప్రాంతంలో లే అవుట్ రిజిస్ట్రేషన్ మినహాయిపు ఎందుకు ఇచ్చారని సీఐడీ ప్రశ్నించింది. ఆ 99 మంది కోర్టు కి వెళ్లారు కాబట్టి కోర్టు ఆదేశాల మేరకు జిఓ వచ్చిందని లోకేష్ చెప్పినట్లు సమాచారం. హెరిటేజ్ ఫుడ్స్ మేనేజ్మెంట్ కమిటీ, బోర్డు పాత్ర ఏంటి? నిర్ణయాలు ఎవరు తీసుకుంటారు అని సీఐడీ ప్రశ్నించింది. దీనిపై అధికారులకు వివరించారు లోకేష్.. ఇదే సమయంలో ఛార్టర్డ్ అకౌంటెంట్ పుస్తకం తీసుకొచ్చి మేనేజ్మెంట్ కమిటీ కూడా నిర్ణయాలు తీసుకోవచ్చు అనే సూచన ఈ పుస్తకంలో ఉంది కదా అని ప్రశ్నించారు. 2014 మార్చ్ 21 న హెరిటేజ్ సంస్థ ఎక్కడెక్కడ భూములు కొనాలని నిర్ణయం తీసుకుందని లోకేష్ ను ప్రశ్నించారు. బయ్యవరం, తూర్పుగోదావరి జిల్లా పామర్రు, ఉప్పల్, అనంతపురం, విజయవాడ- గుంటూరు, హర్యానా- రాజస్థాన్ ప్రాంతాల్లో భూములు కొనాలని బోర్డు నిర్ణయం తీసుకుందని లోకేష్ వివరించారు. పార్టీ అకౌంట్ నుండి లింగమని కంపెనీకి డబ్బులు వెళ్లాయా అని అడిగిన సిఐడికి సమాధానంగా పార్టీ కార్యాలయం నిర్మాణం సమయంలో వాస్తు రీత్యా ఒక చిన్న ముక్క భూమి ఆ కంపెనీ నుండి కొన్నాం. దాని కోసం పార్టీ అకౌంట్ నుండి డబ్బులు చెల్లించాం అని లోకేష్ చెప్పినట్లు తెలిసింది. మీరు ఉంటున్న ఇల్లు అద్దె ఇళ్లా అని సిఐడి అధికారులు ప్రశ్నించారు. సీఐడీ అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానం కోసం మధ్యలో న్యాయవాదుల సలహాలు తీసుకున్నారు లోకేష్. సుమారు ఆరున్నర గంటలపాటు విచారణ జరిగినా.. మరింత సమాచారం అవసరమని.. ఇవాళ కూడా విచారణకు హాజరుకావాలని సూచించారు. లోకేష్తో పాటు సీఐడీ ముందుకు మాజీ మంత్రి నారాయణ అల్లుడు పునీత్.. నారా లోకేష్ ను ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో సీఐడీ విచారణ చేస్తుంది. ఇదే కేసులో మాజీ మంత్రి పొంగూరు నారాయణ అల్లుడు పునీత్ కి కూడా సీఐడీ నోటీసులు ఇచ్చింది. రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్పులో అక్రమాలకు పాల్పడ్డారంటూ నోటీసులు ఇచ్చింది. ఇవాళ విచారణకు హాజరుకావలంటూ నోటీసుల్లో పేర్కొన్నారు అధికారులు. అయితే సీఐడీ ఇచ్చిన నోటీసులు పై హైకోర్టును ఆశ్రయించారు పునీత్.. న్యాయవాదుల సమక్షంలో విచారించేలా సీఐడీని ఆదేశించాలని కోర్టులో వాదనలు వినిపించారు. దీనిపై విచారించిన హైకోర్టు పునీత్ సీఐడీ విచారణకు సహకరించాలని.. లాయర్ల సమక్షంలో విచారణ జరపాలని సీఐడీని ఆదేశించింది. దీంతో ఇవాళ ఒకే కేసులో లోకేష్, పునీత్ వేరువేరుగా విచారణకు హాజరవుతున్నారు. ఇద్దరినీ వేరువేరుగా విచారించి స్టేట్మెంట్ రికార్డ్ చేయనున్నారు సీఐడీ అధికారులు.
Admin