జై భీమ్ టీవీ - ఆంధ్ర ప్రదేశ్ / : తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ స్కాం లో అరెస్ట్, జైలుకు వెళ్లిన తర్వాత ఏపీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోయాయి. చంద్రబాబు ను పరామర్శించేందుకు రాజమహేంద్రవరం జైలుకు వెళ్లిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక ప్రకటనలు చేశారు. పొత్తులపై పవన్ ప్రకటన తర్వాత రెండు పార్టీల్లో కొత్త ఉత్సాహం వచ్చింది.. అయితే పొత్తుల ప్రకటన చేసిన తర్వాత రెండు పార్టీలు కలిసి ఎలా ముందుకు వెళ్ళాలనేదానిపై స్పష్టత ఇస్తామన్నారు జనసేనాని. అయితే పవన్ కల్యాణ్ పొత్తుల ప్రకటన తర్వాత రెండు పార్టీలు కలిసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటున్నాయి. ఇక పవన్ కల్యాణ్ వారాహి విజయయాత్ర కు తెలుగుదేశం పార్టీ శ్రేణులు హాజరవుతారని నారా లోకేష్ ప్రకటించారు. దీంతో సభలు సమావేశాల్లో రెండు పార్టీల నాయకులు కలిసి ముందుకు వెళ్తున్నారు అయితే భవిష్యత్తు కార్యాచరణ కు సంబంధించి రెండు పార్టీల నాయకులతో ఉమ్మడి జేఏసీ వేస్తామని ప్రకటించారు. ఇప్పటికే జనసేన పార్టీ తరపున నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన కమిటీ వేశారు. కానీ టీడీపీ మాత్రం కమిటీ వేసేందుకు మరికొంత కాలం వేచి చూడాలని నిర్ణయించింది. టీడీపీ నిర్ణయంతో ఉమ్మడి కార్యాచరణ ఆలస్యం కానుంది. చంద్రబాబు వచ్చిన తర్వాతనే కమిటీ వేయాలని టీడీపీ నిర్ణయం చంద్రబాబు నెలరోజులు కు పైగా రాజమండ్రి జైల్లోనే ఉన్నారు. ఒక వైపు క్వాష్ పిటిషన్, మరోవైపు బెయిల్ ప్రయత్నాల్లో తెలుగుదేశం పార్టీ నేతలు ఉన్నారు. ప్రస్తుతం చంద్రబాబు అరెస్ట్ కు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. అక్కడక్కడా జనసేన తో కలిసి ఆందోళనలు చేస్తున్నారు. అయితే ఉమ్మడి ఐక్య కార్యాచరణ కమిటీ వేసేందుకు మరికొన్ని రోజులు ఆగాలని నిర్ణయించింది. చంద్రబాబు జైలు నుంచి బయటికి వచ్చిన తర్వాతనే కమిటీ వేయాలని నిర్ణయించింది. అప్పటి వరకూ ఉమ్మడిగా రాష్ట్ర వ్యాప్తంగా రెండు పార్టీలు కలిసి ఎలాంటి పిలుపు ఇవ్వకుండా స్థానికంగా ఉన్న పరిస్థితులు బట్టి ముందుకెళ్తామని టీడీపీ నేతలు చెబుతున్నారు. అయితే చంద్రబాబు మాత్రం జేఏసీ ఏర్పాటు చేసి ముందుకు వెళ్లాలని సూచించినా. అధినేత లేకుండా పార్టీ నిర్ణయాలు తీసుకోవడం సరికాదని అంటున్నారు. అందుకే చంద్రబాబు జైలు నుంచి బయటకు రావడం కాస్త అలస్యమైనప్పటికీ… ఆయన వచ్చిన తర్వాతనే రెండు పార్టీలు కలిసి ముందుకెళ్తామంతున్నారు. ఈలోగా 14 మంది సభ్యులతో ఏర్పాటు చేసిన పొలిటికల్ యాక్షన్ కమిటీ పార్టీ వ్యవహారాలను చూడనుంది..కానీ జనసేన తో కలిసి కార్యక్రమాలు,సీట్ల వ్యవహారం కోసం కమిటీ నియామకం,ఉమ్మడి కార్యాచరణ మాత్రం ఆలస్యం అవుతుందని టీడీపీ నేతలు చెబుతున్నారు. చంద్రబాబు అరెస్ట్ కు నిరసనగా మరిన్ని కార్యక్రమాలు జనసేన-తెలుగుదేశం కలిసి ఉమ్మడి కార్యచరణ ఆలస్యం కానుండటం తో ఈలోగా చంద్రబాబు అరెస్ట్ కు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు ఉదృతం చేయాలని టీడీపీ నిర్ణయించింది.ఇప్పటికే 30 రోజులుగా వివిధ రూపాల్లో ఆందోళనలు,నిరసనలు నిర్వహిస్తున్నాయి టీడీపీ శ్రేణులు…మోత మోగిద్దాం,కాంతి తో క్రాంతి వంటి నిరసన కార్యక్రమాలు తో పాటు నియోజకవర్గాల వారీగా దీక్షలు కూడా చేస్తున్నారు.రాబోయే రోజుల్లో చేపట్టాల్సిన నిరసన కార్యక్రమాలపై 14 మంది సభ్యుల టీడీ పొలిటికల్ యాక్షన్ కమిటీ నిర్ణయం తీసికుంటుందని టీడీపీ నేతలు ప్రకటించారు.
Admin