జై భీమ్ టీవీ - ఆంధ్ర ప్రదేశ్ / : నేటి నుంచి దేశ వ్యాప్తంగా శక్తిని అమ్మవారి రూపంలో కొలిచే నవరాత్రి ఉత్సవాలు ఘనంగా మొదలయ్యాయి. ఆంధ్రప్రదేశ్ లో ప్రముఖ క్షేత్రం ఇంద్రకీలాద్రిపై దసర ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. నేటి నుంచి తొమ్మిది రోజుల పాటు కనక దుర్గమ్మ ఆలయంలో దేవి నవరాత్రులు వైభవంగా జరగనున్నాయి. తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ శరన్నవరాత్రి ఉత్సవాల్లో దుర్గమ్మవారు పది అలంకారాల్లో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఈ ఏడాది దసరా ఉత్సవాల్లో దుర్గమ్మ వారి అలంకారాల్లో మార్పులు చేశారు. దీంతో నవరాత్రులు తొమ్మిది రోజుల్లో పది అలంకారాల్లో దర్శనం ఇవ్వనున్నారు. నవరాత్రుల్లో మొదటి రోజు కనక దుర్గాదేవి వాస్తవంగా స్వర్ణకవచాలంకృత దుర్గాదేవి అలంకారంలో భక్తులకు దర్శనం ఇచ్చేవారు.. అయితే ఇప్పుడు ఆ స్దానంలో శ్రీ మహాచండి అలంకారం రూపంలో దుర్గమ్మ దర్శనం ఇవ్వనున్నారు. అంతేకాదు దసరా రోజున దుర్గాదేవి రెండు అలంకారాల్లో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. దసరా రోజు ఉదయం శ్రీమహిషాసురమర్దినిగా.. మధ్యాహ్నం నుండి శ్రీరాజరాజేశ్వరీదేవిగా దుర్గమ్మ భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. నవరాత్రుల్లో ముఖ్యమైన మూలా నక్షత్రం రోజున దుర్గమ్మ చదువుల తల్లి సరస్వతి దేవిగా కనిపించనుంది. ఈ ఏడాది నవరాత్రుల్లో 20 వ తేదీ మూలా నక్షత్రం వచ్చింది. ఈ రోజున అమ్మవారికి సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.
Admin