జై భీమ్ టీవీ - ఆంధ్ర ప్రదేశ్ / : ఆంధ్రప్రదేశ్లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని గద్దె దించడమే తమ లక్ష్యమని తెలుగుదేశం, జనసేన పార్టీలు పదేపదే చెవుతున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వచ్చే ఎన్నికల్లో ఓడించడం కోసం కలిసొచ్చే పార్టీలతో ముందుకు వెళ్తామంటున్నారు రెండు పార్టీల నేతలు. చంద్రబాబు అరెస్ట్, జైలుకి వెళ్లిన తర్వాత రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోయాయి రాజమహేంద్రవరం జైల్లో చంద్రబాబు తో ములాఖత్ అయిన పవన్ కళ్యాణ్ అనూహ్యంగా పొత్తుల ప్రకటన చేయడంతో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. తెలుగుదేశం పార్టీతో కలిసి ఎన్నికలకు వెళ్తామని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. రెండు పార్టీలు కలిసి ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై ఉమ్మడి కార్యాచరణ కమిటీ నియమిస్తామని పవన్ చెప్పారు. ఇదంతా జరిగి నెల రోజులు గడిచినా జేఏసీ నియామకం జరగలేదు. రెండు పార్టీల తరపున వేరువేరు కమిటీలు నియమించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటించాలని అనుకున్నప్పటికీ కార్యరూపం దాల్చలేదు జనసేన కమిటీ నియామకం జరిగినా టీడీపీ మాత్రం చంద్రబాబు కోసం ఎదురు చూసింది. చంద్రబాబు బయటికి వచ్చిన తర్వాతనే కమిటీ వేయాలని టీడీపీ నిర్ణయించింది. ఈలోగా పొలిటికల్ యాక్షన్ కమిటీ పేరుతో 14 మంది సభ్యుల కమిటీ నియమించింది టీడీపీ, రోజులు గడుస్తున్నా… రాజకీయంగా ఎలాంటి కార్యక్రమాలు లేకపోవడంతో తెలుగుదేశం పార్టీ కూడా కమిటీ నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. ఏ పార్టీలో ఎవరెవరు సభ్యులంటే… తెలుగుదేశం పార్టీతో సమన్వయం చేసుకునేందుకు జనసేన పార్టీ కమిటీ నియామకం ఎప్పుడో పూర్తి చేసింది. స్వయంగా ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కమిటీ ప్రకటించారు. జనసేన కమిటీకి చైర్మన్గా నాదెండ్ల మనోహర్ ఉన్నారు. సభ్యులుగా మరో ఐదుగురిని ప్రకటించారు. జనసేన కమిటీలో సభ్యులుగా పార్టీ వైస్ ప్రెసిడెంట్ మహేందర్ రెడ్డి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావు, పార్టీ ప్రధాన కార్యదర్శి పాలవలస యశస్వి, జనసేన పార్టీ మత్స్యకార విభాగం చైర్మన్ బొమ్మిడి నాయకర్ సభ్యులుగా ఉన్నారు. ఇక తెలుగుదేశం పార్టీ ఐదుగురు సభ్యులతో కమిటీ ప్రకటించింది.పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, పొలిట్ బ్యూరో సభ్యులు పితాని సత్యనారాయణ,పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్,మాజీ మంత్రి పితాని సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య సభ్యులుగా ఉన్నారు. ఈ రెండు పార్టీల కమిటీలు కలిసి జేఏసీగా ఏర్పడనున్నాయి. ఇకపై జేఏసీ ద్వారా ఉమ్మడి కార్యాచరణ రూపొందించనున్నాయి. రెండు పార్టీల సమన్వయంతో కార్యక్రమాల నిర్వహణ, పోరాటాలు, ఇతర రాజకీయ ప్రకటనలు జేఏసీ ద్వారా ఉండనున్నాయి. దూకుడు పెంచనున్న రెండు పార్టీలు.. చంద్రబాబు అరెస్ట్ తర్వాత తెలుగుదేశం పార్టీ రాజకీయ కార్యక్రమాలు పూర్తిగా నిలిచిపోయాయి. చంద్రబాబు కు మద్దతుగా ఆందోళనలు,నిరసనలు చేస్తున్నప్పటికీ ప్రజల్లోకి వెళ్లి కార్యక్రమాలు చేయడం లేదు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వారాహి యాత్రతో ప్రజల్లోకి వెళ్తున్నారు. ఇకపై ఉమ్మడి కార్యాచరణ కమిటీ రెండు పార్టీలు కలిసి రాజకీయ కార్యక్రమాలు నిర్వహించేలా ప్లాన్ చేయనున్నాయి. త్వరలోనే రెండు కమిటీలు కలిసి సమావేశం ఏర్పాటు చేసుకుంటాయని టీడీపీ నేతలు చెబుతున్నారు.
Admin