జై భీమ్ టీవీ - ఆంధ్ర ప్రదేశ్ / : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త పంచాయితీ షురూ అయ్యింది. టీడీపీ, వైసీపీ మధ్య ఈసారి పాల దందా వ్యవహారం బజారుకెక్కింది. రాష్ట్రంలోని డెయిరీలను అడ్డం పెట్టుకుని వందల కోట్ల రూపాయలను తెలుగు దేశం పార్టీ సంపాదించిందని ఏకంగా రాష్ట్ర మంత్రి సీదిరి అప్పలరాజు సంచలన ఆరోపణలు చేశారు. దీంతో అదే రేంజ్లో టీడీపీ నుంచి రియాక్షన్ వచ్చింది. వైసీపీ సర్కార్ దోచుకున్న సొమ్ము తిరిగి ప్రజలకు ఇచ్చే దమ్ముందా అంటూ టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర సవాల్ విసిరారు. ఏపీలో పాలసేకరణ పథకం రాజకీయాలకు వేదికగా మారింది. అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. పాలవెల్లువ పథకం చుట్టూ వెల్లువలా విమర్శలు వస్తున్నాయి. అయితే ఆ విమర్శలకు ధీటుగా కౌంటర్ ఇస్తోంది అధికారపక్షం. అమూల్ డెయిరీ రావడంతో ఏపీలో పాల ధరలు భారీగా పెరిగాయన్నారు మంత్రి సీదిరి అప్పలరాజు. జగనన్న పాలవెల్లువ పథకం అమలుచేయకముందు పాల ధరలు ఏడాదికో, రెండేళ్ళకో పెంచేవారు. కానీ అమూల్ సంస్థ గత మూడేళ్లలోనే 8 సార్లు ధరలు పెంచిందన్నారు. దీంతో ప్రైవేటు డైరీలు కూడా తప్పనిసరి పరిస్థితుల్లో రేట్లు పెంచారని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల 73 మహిళా రైతుల నుంచి పాల సేకరణ జరుగుతోంది. పాడి రైతులకు రూ. 4 వేల 900 కోట్లకు పైగా అదనపు లబ్ది చేకూరిందన్నారు మంత్రి సీదిరి అప్పలరాజు. పాలవెల్లువ పథకంపై జనసేన పార్టీ నేత నాదెండ్ల మనోహర్, టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర ఆరోపణలు చేయడంపై తీవ్రంగా మండిపడ్డారు. గతంలో సంగం, విశాఖ, కృష్ణా డెయిరీలను చంద్రబాబు తనకు అనుకూలంగా ఉండేవాళ్లకు కట్టబెట్టారని ఆరోపించారు. ప్రభుత్వానికి చెందిన సంగం డెయిరీ ధూళిపాళ్ల నరేంద్రకు ఎలా వెళ్లిందని ప్రశ్నించారు మంత్రి సీదిరి. మంత్రి వ్యాఖ్యలపై టీడీపీ నేతలు సీరియస్గా రియాక్ట్ అయ్యారు. వైసీపీ నేతలు దోచుకున్నది తిరిగి ఇచ్చేస్తే తాను కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా అంటున్నారు టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర. చంద్రబాబు పాలనలో ఆదరణ పథకం కింద ఏ ఒక్క కుటుంబమైనా బాగుపడిందా?. అని వైసీపీ ప్రశ్నిస్తుంటే.. పాలవెల్లువతో రాష్ట్రానికి జరిగిన లాభమేంటో చెప్పాలని డిమాండ్ చేస్తోంది టీడీపీ. గత ప్రభుత్వంలో పాడిరైతులను దోచుకున్నారని ఇప్పటి ప్రభుత్వం ఆరోపిస్తుంటే.. వైసీపీ హయాంలోనే పెద్ద స్కామ్ జరిగిందని ఆరోపిస్తోంది తెలుగు దేశం పార్టీ. చూడాలని మరీ ఈ కొత్త పంచాయితీ ఎక్కడి దాకా దారి తీస్తుందో..!
Admin