జై భీమ్ టీవీ - ఆంధ్ర ప్రదేశ్ / : ఆంధ్రప్రదేశ్లో ఆక్వా రంగాన్ని ఆదుకునేందుకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం కొంతకాలంగా అనేక నిర్ణయాలు తీసుకుంటోంది. కరోనా సమయంలో రొయ్యలు, చేపల పరిశ్రమ అనేక నష్టాలను చవిచూసింది. అయితే రైతులు నష్టపోకుండా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు కూడా చేపట్టింది. అంతర్జాతీయ మార్కెట్కు రొయ్యలు ఎగుమతి నిలిచిపోవడంతో కంపెనీలు కొనడానికి ముందుకు రాలేని పరిస్థితి ఏర్పడింది. అలాంటి సమయంలో రొయ్యల కంపెనీల యజమానులతో ప్రభుత్వం సమావేశం ఏర్పాటు చేసి రైతులు నష్టపోకుండా ధరలను నిర్ధారించింది. ఎంపెడా సహకారంతో రాష్ట్ర మత్స్యశాఖ రైతులను ఆదుకునేలా ముందుకు వెళ్లింది. ఆ తర్వాత కూడా ఆక్వా రైతులకు ఇబ్బంది లేకుండా ఉండేలా ప్రత్యేకంగా ఓ కమిటీని కూడా నియమించింది. ఆక్వా సాధికార కమిటీ పేరుతో ఏర్పాటు చేసిన ఈ కమిటీలో మంత్రులు సిదిరి అప్పలరాజు, బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆక్వా డెవలప్మెంట్ అధారిటీ అప్సడా ఛైర్మన్ వడ్డి రఘురాం సభ్యులుగా ఉన్నారు. ఈ సాధికారత కమిటీ ఆక్వా పరిశ్రమలో ఒడిదుడుకుల నివారణకు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటుంది. ఆక్వా ఫీడ్, ఆక్వా సీడ్ రేట్ల నియంత్రణలకు కమిటీ చర్యలు తీసుకుంటుంది. వచ్చే నెల నుంచి రొయ్య రైతులకు విద్యుత్ సబ్సిడి.. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధ్యక్షతన ఆక్వా సాధికారిత కమిటీ ఆరో సమావేశం అమరావతి సచివాలయంలో జరిగింది. గతంలో ఆక్వా ఫీడ్, సీడ్ రేట్లను నియంత్రించే విధానం లేకపోవడం వల్ల ఆక్వా రైతులు నష్టపోయారని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. అంతర్జాతీయ మార్కెట్ల ఒడిదుడుకులకు స్థానికంగా ఆక్వారంగం ఇబ్బందులను ఎదుర్కొందని అన్నారు. వీటిని క్రమబద్దీకరించేందుకు సాధికారిత కమిటీ ఎప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తున్నాయని మంత్రి పెద్దిరెడ్డి చెప్పారు. రాష్ట్రంలో మొత్తం 4 లక్షల 65 వేల ఎకరాలు ఆక్వాజోన్ పరిధిలో ఉందని కమిటీ గుర్తించింది. వీటిలో పది ఎకరాల లోపు 3.26 లక్షల ఎకరాలు విద్యుత్ సబ్సిడీకి అర్హత ఉన్నట్లు గుర్తించింది ప్రభుత్వం. అర్హత ఉన్న ప్రతి ఆక్వా రైతుకు విద్యుత్ సబ్సిడీ ఇవ్వాలన్న సీఎం జగన్ నిర్ణయం మేరకు ప్రభుత్వం ఈ-ఫిష్ సర్వే నిర్వహించినట్లు మంత్రి పెద్దిరెడ్డి చెప్పారు. మొత్తం 46 వేల 433 ఆక్వా విద్యుత్ కనెక్షన్లు సబ్సిడీకి అర్హత ఉన్నట్లు గుర్తించామన్నారు. మరో 4230 కనెక్షన్లకు కూడా రైతుల నుంచి వచ్చిన దరఖాస్తులను పరిశీలించిన తరువాత వారికి కూడా సబ్సిడీకి అర్హత ఉన్నట్లు నిర్ధారించినట్లు మంత్రి తెలిపారు. ఈ కనెక్షన్లకు వచ్చే నెల ఒకటో తేదీ నుంచి సబ్సిడీ విద్యుత్ అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. ప్రభుత్వం నిర్ణయించిన రేట్లకే రొయ్యలు కొనుగోలు చేయాలి.. అంతర్జాతీయ మార్కెట్లో ఉన్న డిమాండ్, ధరల ఆధారంగా ఆక్వా సాధికార కమిటీ ఎప్పటికప్పుడు రొయ్యల ధరలను నిర్ధారిస్తుంది. రైతులకు నష్టం లేకుండా పెట్టుబడి ఖర్చు పోను లాభం చేకూరేలా ధరలను నిర్ణయిస్తుంది. ఈ ధరల ప్రకారమే రొయ్యల కంపెనీలు రైతుల నుంచి రొయ్యలను కొనుగోలు చేయాలని కమిటీ ఆదేశిస్తుంది. ప్రస్తుతం రాష్ట్రంలో వంద కౌంట్ రొయ్యలకు కేజీ 240గా రేటు ఖరారు చేసింది కమిటీ. ఇంతకన్నా తక్కువకు కొనుగోళ్ళు చేయడానికి వీలులేదు. అలాగే స్థానిక మార్కెట్లో ప్రతి నెలా వెయ్యి మెట్రిక్ టన్నుల ఆక్వా ఉత్పత్తులను విక్రయిస్తున్నారు. దీనిని మరింత పెంచేందుకు చర్యలు తీసుకోవాలి. ఆక్వాహబ్ల ద్వారా స్థానిక మార్కెట్లో వినియోగంను ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకోవాలని కమిటీ అభిప్రాయపడింది.
Admin