జై భీమ్ టీవీ - ఆంధ్ర ప్రదేశ్ / : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న జగనన్న భూహక్కు-భూరక్ష పథకం మూడోదశను 2024 జనవరి నాటికి పూర్తి చేయాలని అధికారులను కేబినెట్ సబ్ కమిటీ ఆదేశించింది. వెలగపూడిలోని సచివాలయంలో మంగళవారం జగనన్న భూహక్కు-భూరక్ష పథకంపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, ప్రభుత్వ ప్రధాన సలహాదారు అజేయ కల్లాం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా అమలు జరుగుతున్న సమగ్ర సర్వేపై మంత్రుల కమిటీ సమీక్షించింది. దేశంలోనే అత్యంత వేగంగా సమగ్రసర్వే మన రాష్ట్రంలోనే జరుగుతోందని, ఇప్పటి వరకు రెండు దశల్లో సర్వే పూర్తి చేశామని మంత్రులు తెలిపారు. మొదటి, రెండోదశల్లో మొత్తం నాలుగు వేల గ్రామాల్లో సర్వే ప్రక్రియ పూర్తి చేసి, భూహక్కు పత్రాలను పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. మూడోదశ సర్వేను వచ్చే ఏడాది జనవరి నెలాఖరు నాటికి పూర్తి చేయాలనే లక్ష్యానికి అనుగుణంగా అన్ని విభాగాల అధికారులు పనిచేయాలని సూచించారు. రాష్ట్రంలో జరుగుతున్న సర్వే ప్రక్రియ అత్యంత శాస్త్రీయంగా జరుగుతోందని, ఇటీవలే కేంద్ర కార్యదర్శి, అడిషనల్, జాయింట్ సెక్రటరీ స్థాయి అధికారులతో పాటు అయిదు రాష్ట్రాల నుంచి సర్వే విభాగానికి సంబంధించిన కమిషనర్లు కూడా రాష్ట్రంలో పర్యటించి, మనం అమలు చేస్తున్న విధానాన్ని పరిశీలించారని అన్నారు. ఈ సందర్భంగా నేరుగా గ్రామాల్లో రైతులతో ఈ అధికారుల బృందం మాట్లాడి, సర్వే ఫలితాల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారని అన్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 13,072 గ్రామాల్లో డ్రోన్ ఫ్లైయింగ్ ప్రక్రియ పూర్తయ్యిందని తెలిపారు. 9 వేల గ్రామాలకు డ్రోన్ ఇమేజ్ లను కూడా పంపించడం జరిగిందని తెలిపారు. మూడోదశకు సంబంధించి ఇప్పటికే 360 గ్రామాల్లో సర్వే పూర్తయ్యింది. అర్బన్ ప్రాంతాల్లో కూడా సర్వే ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 123 అర్బన్ లోకల్ బాడీస్ లో 15.02 లక్షల ఎకరాలను సర్వే చేయాల్సి వుంది. మూడోదశ నాటికి నాలుగు యూఎల్బిల్లో సర్వే ప్రక్రియపూర్తి చేసి, హక్కు పత్రాలను అందించాలనే లక్ష్యం మేరకు పనిచేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన సలహాదారు అజేయ్ కల్లాం తదితరులు పాల్గొన్నారు.
Admin