జై భీమ్ టీవీ - ఆంధ్ర ప్రదేశ్ / : ప్రకాశం జిల్లా, అక్టోబర్ 14: పెళ్లి కావాలి… నాకు పెళ్లి కావాలి… అంటూ ఇటీవల సోషల్ మీడియాలో హల్చల్ చేసిన ఓ చిన్నారి వీడియో తరహాలోనే ఓ కుర్రాడు తనకు పెళ్లి కావాలంటూ తండ్రిని వేధించడం మొదలుపెట్టాడు. ఆ కుర్రాడి మానసిక స్థితి సరిగ్గా లేకపోవడంతో పాటు ఎలాంటి ఉపాధి లేకపోవడంతో కొడుక్కి పెళ్లి చేసేందుకు ఆ తండ్రి సుముఖత వ్యక్తం చేయలేదు. అంతే కాకుండా నీకు పిల్లనెవరు ఇస్తార్రా అంటూ పెళ్లి కోసం వేధిస్తున్న కొడుక్కి నచ్చ జెప్పేందుకు ప్రయత్నించాడు. అదే ఆ తండ్రి చేసిన తప్పైంది. తనకు తండ్రి పెళ్లి చేయకపోవడంతో కోపం పెంచుకున్న ఆ కొడుకు ఉన్మాదిగా మారిపోయాడు. తన తండ్రి తన మాట వినడం లేదని విపరీతమైన కోపంతో కత్తితో గొంతుకోసి చంపేశాడు. అనంతరం తానూ గొంతు కోసుకున్నాడు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. పెళ్లి చేయలేదనే నెపంతో కుమారుడు తండ్రిని హత్య చేసిన ఘటన ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం రాయవరం కనకదుర్గమ్మ కాలనీలో చోటు చేసుకుంది. తండ్రి బాల భద్రాచారిని ఇంటి నుంచి బయటకి తీసుకెళ్లిన కొడుకు గురునారాయణాచారి పథకం ప్రకారం తన వెంట తెచ్చుకున్న కత్తితో ఆయన గొంతు కోశాడు. తర్వాత గరునారాయణ కూడా గొంతు కోసుకున్నాడు. స్వల్ప గాయాలైన అతన్ని స్థానికులు ఒంగోలు తరలించారు. అనంతరం సమాచారం అందుకుని ఘటనా స్థలాన్ని డీఎస్పీ వీరారాఘవరెడ్డి పరిశీలించారు. రక్తస్రావమైన కొడుకును ప్రాథమిక చికిత్స అనంతరం ఒంగోలు రిమ్స్కు తరలించారు. కొడుకు మానసిక స్థితి బాగాలేదని, తనకు తండ్రి పెళ్లి చేయడం లేదన్న కారణంగా ఈ దారుణానికి పాల్పడ్డాడని స్థానికులు చెబుతున్నారు. గత కొంతకాలంగా తనకు పెళ్లి చేయాలని కొడుకు గురునారాయణాచారి తన తండ్రి బాలభద్రాచారిని వేధిస్తున్నాడు. తన కొడుకు మానసిక పరిస్థితి బాగా లేకపోవడంతో పెళ్లి చేసేందుకు నిరాకరించాడు ఆ తండ్రి. అంతేకాకుండా ఉద్యోగం, సద్యోగం లేని నీకు పిల్లను ఎవరు ఇస్తార్రా… అంటూ మంచి మాటలు చెప్పిన తండ్రిపై కోపం పెంచుకున్న కొడుకు గురునారాయణాచారి ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Admin